అదానీ గ్రూప్ షేర్లు పడిపోతున్నా నిలకడగా బ్యాంకింగ్ రంగం

అదానీ గ్రూప్ షేర్లు పడిపోతున్నా నిలకడగా బ్యాంకింగ్ రంగం

అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోతున్నప్పటికీ దేశంలోని బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది.  ‘బ్యాంకుల మూలధన సమృద్ధి, ఆస్తుల నాణ్యత, లిక్విడిటీ, ప్రొవిజన్ కవరేజ్, లాభదాయకతలకు సంబంధించిన వివిధ రకాల పారామీటర్లు మంచి స్థానంలోనే ఉన్నాయి. ఆర్‌బీఐ జారీ చేసిన లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్ వర్క్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయి.’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

అయినప్పటికీ అప్రమత్తంగానే ఉన్నామని, దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వం కోసం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. ఓ గ్రూప్ సంస్థలకు దేశీయ బ్యాంకులు ఇచ్చిన అప్పులపై ఆందోళనలు ఉన్నట్లు మీడియా నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నట్లు పేర్కొంది.

ఇలా ఉండగా, అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో పెద్ద దుమారం చెలరేగుతున్న తరుణంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల వివరాలపై ఆరా తీస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఇప్పటికే చాలా బ్యాంకులను.. అదానీకి ఇచ్చిన లోన్లు, ప్రస్తుత స్టేటస్ గురించి వెల్లడించాలని కోరినట్లు బ్యాంకింగ్ వర్గాలు కూడా వెల్లడించారు.

ఇప్పటికే అదానీ గ్రూప్ సెక్యూరిటీస్‌పై మార్జిన్‌పై రుణాలు ఇవ్వడానికి స్విస్‌కు చెందిన క్రెడిట్ సూయిజీ, అమెరికాకు చెందిన సిటీ గ్రూప్ నిరాకరించాయి. దీంతో ఇక అదానీ గ్రూప్ బాండ్లను హామీగా అంగీకరించబోవు. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ కూడా బ్యాంకుల నుంచి వివరాలను కోరుతున్నట్లు తెలుస్తున్నది.