ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం

అమెరికాలో పర్యటించాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వానం అందిందని ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈమేరకు ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారని పేర్కొంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ మన్నించారని, త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపింది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ భారత్ కు రానున్నారు. అదేవిధంగా జూన్, జులై నెలల్లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్ లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోదీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్ ను రూపొందిస్తామని పీఎంవో వివరించింది.

ప్రధాని మోదీ 2021 లోనూ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో వాషింగ్టన్ లో బైడెన్, మోదీల మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. తాజా ఆహ్వానం మేరకు ఈ ఏడాది మరోసారి మోదీ అమెరికాలో పర్యటిస్తారు.

ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. మోడీ  గౌరవార్థం అమెరికా అధ్యక్ష భవనంలో బైడెన్ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది బాలిలో జరిగిన జి 20 సదస్సులో ఇరువురు నేతలు కలుసుకున్నారు.