శిశుమందిరాలపై విషప్రచారం తిప్పికొట్టాలి

శిశుమందిరాల అభివృద్ధిని సహించలేని కొందరు ఇక్కడి బోధన గురించి విషప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థుల మీద ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు.
 
శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బండ్లగూడలోని శారదాధామంలో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర స్థాయి మహాసమ్మేళనంలో మాట్లాడుతూ శిశుమందిరాల్లో సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఆ సంస్కారమే జాతీయ భావనకు పునాది అని ఆయన తెలిపారు.
 
ఒకప్పుడు రామాయణ, భాగవతాల వంటి పురాణాల్లో మాతృమూర్తుల గొప్పతనం గురించి నేర్చుకున్నామని.. కానీ, నేటి సీరియళ్లు, సినిమాల్లో మహిళలను విలన్లుగా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవంక, ఏస్కూల్లో ఎక్కువ ఫీజు కడితే పిల్లలకు చదువు అంత బాగా వస్తుందన్న భావనలో పడిపోయిన తల్లిదండ్రులు.. పిల్లల పెంపకంలో తమవంతుగా ఏం చేయాలన్న బాధ్యతను మరిచిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు విద్యారంగం బాగా నష్టపోయిందని, ఇకనైనా విద్యావిధానాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో దేశం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ జాతీయవాద శక్తులను ఏకం చేసి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని పేర్కొన్నారు.  సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రముఖ స్థానాల్లో ఉన్నారని చెప్పారు.
 
రెండు లక్షల మందికి పైగా ఉన్న సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులను సామాజిక సేవలో పాల్గొనేలా క్రియాశీలకంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమామహేశ్వర్‌రావు వెల్లడించారు.  ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితుల్లో తమ విద్యార్థులను మంచిమార్పును సృష్టించే సంఘటనా శక్తిగా కార్యోన్ముఖం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.
బలహీనపడుతోన్న సాంస్కృతిక సంపదను తిరిగి పటిష్టం చేసుకునేలా సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థుల్లో జాతీయ దృష్టికోణం మెరుగుపడాలని ఆకాంక్షించారు.  ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదని హితవు చెప్పారు. 
 
అత్యంత ఉత్సాహభరితంగా జరిగిన ఈ సమ్మేళనానికి మణిపాల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ తిరుమలరావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. పూర్వ విద్యార్థులు డీసీపీ రావుల గిరిధర్‌, కో ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ సభ్యురాలు కిరణ్మయి తదితరులను ఈ సందర్భంగా వేదికపై సన్మానించారు.
 
పూర్వ విద్యార్థి పరిషత్ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌ పరిషత్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. పూర్వ విద్యార్థులు తాము చదివిన పాఠశాలలను అన్ని వనరులతో ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
 
 విద్యాభారతి ప్రాంత సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, క్షేత్ర సేవా ప్రముఖ్‌ కుందూరు విద్వాన్‌రెడ్డి, క్షేత్ర ప్రశిక్షణా ప్రముఖ్‌ రావుల సూర్యనారాయణ, విద్యాభారతి ఉచ్ఛ శిక్షా సంస్థాన్‌ అఖిలభారత అధ్యక్షుడు మురళీమనోహర్‌, పూర్వ విద్యార్థి పరిషత్‌ అధ్యక్షుడు హరిస్మరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సమ్మేళనంలో శిశుమందిర్‌ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, గీతాలు అందరినీ అలరించాయి. ఈ సమ్మేళనంలో భాగంగా మధ్యాహ్నం నిర్వహించిన సదస్సులో భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.