సీఎం జగన్‌కు తప్పిన ప్రమాదం.. విమానం అత్యవసర ల్యాండింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. జగన్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరగా ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా.. తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
 
ఈ ఘటన కారణంగా  సీఎం జగన్ ఎయిర్ పోర్ట్‌లోనే ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 5 గంటల 3 నిమిషాలకు టేకాఫ్ అవ్వగా.. సాంకేతిక సమస్య కారణంగా.. 5 గంటల 20 నిమిషాలకు మళ్లీ ల్యాండింగ్ అయ్యింది.   ఢిల్లీలో జరిగే జీ-20 సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరారు.
విమానం టేకాఫ్ అయిన తర్వాత విమానం గాలిలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. అనుమతితో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కాగా విమానం టేకాఫ్ అయిన ప్రదేశంలో కాకుండా అక్కడికి దూరంగా ల్యాండింగ్ చేయడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఈ అనూహ్య పరిణామంతో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన గన్నవరం నుంచి తిరిగి తాడేపల్లికి వెళ్లిపోయారు.
 

సీఎం జగన్ ఢిల్లీ, హైదరాబాద్, కడప ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేక విమానంలోనే వెళ్తారు.ఒకవేళ విమానంలో సాంకేతిక లోపం సరిదిద్దితే మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశానికి వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలను రేపు ఉదయం రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశం రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది.