ఏపీలో అభివృద్ధి లేదు.. తిరోగమనం పాలైంది

ఏపీలో అభివృద్ధి లేదని, రాష్ట్రం తిరోగమనం పాలైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి రాష్ట్ర ప్రభుత్వం తయారైందని విమర్శించారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ 2024లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ బీజేపీనేనని స్పష్టం చేశారు.
సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటల దీక్ష చేపట్టిందని గుర్తు చేశారు.  మిగిలిన పార్టీలు మీటింగ్‌లు పెట్టి వెళ్లిపోవడమనని పేర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీనే అని తెలిపారు.  ఎస్సీలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శిస్తూ  ఏప్రిల్‌లో ఎస్సీల బహిరంగ సభ విజయవాడలో నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
 
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి.. అభివృద్ధిని విస్మరించి ఓ కార్పొరేట్‌ కంపెనీ తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు.  జగన్ ప్రభుత్వంపైన గళమెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెబుతూ  రాష్ట్రం ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిందని, పైగా వైన్ మాఫియా, శాండ్ మాఫియా వైసీపీ నేతలే చేస్తున్నారని వీర్రాజు దుయ్యబట్టారు.
 
వాలంటీర్ వ్యవస్థ ద్వారా అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని చెబుతూ 35 లక్షల ఇళ్లకు లక్షా 80 వేల రుణం కేంద్రమే ఇస్తుందని తెలిపారు. జగన్ నవరత్నాలు కన్నా మోదీ సంక్షేమమే ఏపీలో ఎక్కువ అని స్పష్టం చేశారు. రూ. 8 లక్షల కోటను కేంద్రం ఏపీకి అదనంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు వీర్రాజు స్పష్టం చేశారు.
 
వైసీపీ, టీడీపీలు కేంద్రం చేసిన సాయం ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. మేం సంక్షేమం చేస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ప్రజలను చంపేస్తుందని అంటూ ఆయన మండిపడ్డారు. గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తొండియా కూడా పాల్గొన్నారు.