కీరవాణి, చంద్రబోస్‏లను సత్కరించిన గవర్నర్‌

తెలంగాణ రాజ్ భవన్‍లో 74వ గణతంత్ర దినోత్సవవేడుకలలో భాగంగా గవర్నర్ డా. తమిళి సై సౌందర్ రాజన్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్ తమిళి సై సత్కరించారు. ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయ రచయిత చంద్రబోస్‏లను సత్కరించారు. వీరిని శాలువతో సన్మానించి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.

అలాగే.. ఎన్జీవో భగవాన్ మహవీర్ వికలాంగ సహాయతా సమితి, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, సివిల్స్ శిక్షకురాలు బాలలతలను గవర్నర్ సన్మానించారు.కాగా, బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ఎంఎం కీరవాణికి పద్మ శ్రీ అవార్డ్ వరించింది. భారతదేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీని కీరవాణి అందుకోనున్నారు. మరోవైపు ఆయన మ్యూజిక్ అందించిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

అలాగే ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకున్నారు. మార్చిలో ఆస్కార్ అవార్డు వేడుకలు జరగనున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఊర్రుతలుగిస్తోన్న నాటు నాటు పాటను చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటకు ప్రేమ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు.

మరోవంక, ”నాటు… నాటు..” పాటకు ఆస్కార్‌ పురస్కారం మరొక్క అడుగు దూరంలోనే ఉందని ప్రశంసిస్తూ పలురు సెలబ్రిటీలు ట్వీట్లుచేస్తున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రవితేజ, రక్షిత్‌ శెట్టి, మంచు విష్ణు, ప్రేమ్‌ రక్షిత్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళసై తదితరులు ”తెలుగు సినిమా ఆస్కార్‌ కోసం తుదిబరిలో నిలవడం పోటీపడుతుండటం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం” చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఆస్కార్‌ బరి వరకు తీసుకెళ్లిన రాజ మౌళిని ప్రశంసిస్తూ, చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు.