ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసిన రెండు మొబైల్ ఫోన్ల మధ్య వీడియో కాల్ చేసి ఆపరేటింగ్ సిస్టం పనితీరును కేంద్ర మంత్రులు పరీక్షించారు. కేంద్ర ఐటీ, టెలీకాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘భారోస్’ మొబైల్ ఫోన్తో వీడియో కాల్ చేశారు.
ఆండ్రాయిడ్, ఐ-ఓఎస్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టం ఉందని సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇన్ఫ్రా సహా అన్ని రంగాల్లో ఇతర దేశాలపై ఆధారపడకుండా భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధాన మంత్రి ఆలోచనలను నిజం చేస్తూ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రూపుదిద్దుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. బలమైన స్వదేశీ పరిజ్ఞానం, స్వయం సమృద్ధితో రూపొందించిన డిజిటల్ ఇన్ఫ్రాతో దేశంలోని నిరుపేదలే ఎక్కువగా లబ్ది పొందుతారని తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలకు, విధానాలకు తగ్గట్టుగా పనిచేసేవారిని ప్రోత్సహించడం ప్రధాని మోదీ విలక్షణ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు.
నేడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న డాటా ప్రైవేసీ భయాలను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పోగొడుతుందని, వ్యక్తిగత సమాచార భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా భద్రత విషయంలో రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఆపరేటింగ్ సిస్టం త్వరలోనే ప్రజా వినియోగంలోకి అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది ప్రభుత్వ నిధులతో తయారు చేసిన ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రభుత్వ, పబ్లిక్ సిస్టమ్ల కోసం దీన్ని వినియోగించవచ్చు. స్మార్ట్ఫోన్ల కోసం విదేశీ ఓఎస్లపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భవిష్యత్తులో దేశీయ ఎకో సిస్టమ్ను రూపొందించుకోవడంలో ఇది కీలక ముందడుగుగా ఉంది. పటిష్టమైన ప్రైవసీ, సెక్యూరిటీ అవసరమైన సంస్థలకు ముందుగా భారోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది.
మొబైల్లో సున్నితమైన, గోప్యమైన సమాచారాన్ని ఉంచుకోవాల్సిన యూజర్లకు ఈ ఓఎస్ చాలా ఉపయోగకరం. ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ శాఖలకు కీలకంగా మారనుంది. ఇందులో ఎలాంటి డిఫాల్ట్ యాప్స్ ఉండవు. దీంతో అవసరం లేని ఏ యాప్ను కూడా యూజర్లు ఫోన్లో కచ్చితంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
అలాగే ఫోన్లోని యాప్ల పర్మిషన్ల విషయంలోనూ యూజర్లకు ఎక్కువ నియంత్రణ ఉంటుంది. దీంతో నమ్మదగిన యాప్లకు అవసరమైన పర్మిషన్లను మాత్రమే ఇవ్వొచ్చు. దీంతో డేటా, ప్రైవసీ సేఫ్గా ఉంచాయి. ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్ నుంచి ట్రస్టెడ్ యాప్లను మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో వాడే ఛాన్స్ ఉంటుంది.
అయితే, సాధారణ యూజర్లకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే మొబైళ్లు అందుబాటులోకి వచ్చేందుకు చాలా సమయం పట్టొచ్చు. ముందుగా ప్రభుత్వ శాఖల్లో ముఖ్యమైన డేటాతో పని చేసే ఉద్యోగులకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైళ్లను ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు