ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 28న సీబీఐ విచారణకు హాజరవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తొలుత ఈనెల 23న మొదటిసారి అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్లో జనవరి 24న విచారణకు రావాలని పేర్కొన్నారు.
అయితే నోటీసులు ఇచ్చి ఒక్క రోజులో రావాలంటే ఎలా? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి తెలిపాడు. 4 రోజుల పాటు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని, మరోసారి సీబీఐ నోటీసులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అని పేర్కొన్నాడు. దానితో అవినాష్ విజ్ఞప్తి మేరకు సీబీఐ అధికారులు 28న విచారణకు రమ్మనమని చెబుతూ మరోసారి నోటీసులు జారీ చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత వేసిన పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది.
హైదరాబాద్ లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. కేసును తెలంగాణకు బదిలీ చేసిన తర్వాత విచారణలో వేగం పెంచిన సిబిఐ ఇప్పుడు అవినాష్ పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు.