రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలో 26 జిల్లాలతో పాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి)ను 2019 లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
లక్ష రూపాయల లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు వర్తింపచేయాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్దరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్ధికసాయం అందిస్తున్నామని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు దాతల నుంచి రూ. 650 కోట్లు విరాళాలు సమకూరాయని తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో 2019 వ సంవత్సరానికి ముందు 502 ఆలయాలు నిర్మించినట్టు వెల్లడించారు. అనంతరం ఈ ఫౌండేషన్ సహకారంతో 320 ఆలయాల నిర్మాణానికి రూ.32 కోట్లు శ్రీవాణి నిధులు మంజూరు చేశామని, వీటిలో 110 ఆలయాలు ఒక నెలలో, 210 ఆలయాలు 6 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు.
రాష్ట్ర దేవాదాయశాఖ సౌజన్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో 932 ఆలయాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు కేటాయించామని, దశలవారిగా ఇప్పటి వరకు రూ.25 కోట్లు మంజూరు చేశామని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 150 పురాతన ఆలయాల జీర్ణోద్దరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇందుకోసం రూ. 130 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ. 71 కోట్లు విడుదల చేశామని తెలియజేశారు.
ఈ విధంగా 1402 ఆలయాల నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. మరో 667 ఆలయాల నిర్మాణానికి వినతులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వీటిని ఖరారుచేసి నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకోసం ప్రతినెలా ఆలయ కమిటి బ్యాంకు అకౌంట్లో రూ.5 వేలు జమ చేస్తామని, ఇందుకోసం రూ.12.50 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.
వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకు గాను ప్రతినెలా రూ.2 వేలు ఆలయ కమిటి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు వివరించారు. ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టిటిడి బృందం తరచూ తనిఖీ చేస్తుందని తెలిపారు.
కాగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 50 శాతం నిధులను టిటిడి జనరల్ అకౌంట్కు బదిలీ చేస్తున్నారని, ఆదాయం కోసమే శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తున్నారని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సామాజిక మాద్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి దుష్పృచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
More Stories
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
విశాఖ స్టీల్ మూతపడే దుస్థితి శోచనీయం
రాజంపేటను జిల్లా చేయకుండా అడ్డుకున్న జగన్