ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్పై భారతీయ జనతా పార్టీ మండిపడింది. భారత్కు చట్టాలపై, పాలనపై, మానవ హక్కులపై నీతులు చెప్పొద్దంటూ ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ హితవు పలికారు. గుజరాత్ అల్లర్ల పేరుతో మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పన్నిన కుట్ర భగ్నమైందని ఆయన ధ్వజమెత్తారు. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బీబీసీ మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికి పైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు.
పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ప్రశ్నించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కంటే బీబీసీనే ఎక్కువ అయినట్లు కొంత మంది మాట్లాడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు మండిపడ్డారు. దేశంలో కొందరు ఇప్పటికీ వలస పాలన మత్తులో నుంచి బయపడలేదని, వారు తమ నైతిక గురువులను ప్రసన్నం చేసుకోవడానికి దేశ గౌరవాన్ని ఏ స్థాయికైనా దిగజార్చుతారని విమర్శించారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్ నుంచి ఇది తప్ప ఇంకేం ఆశించలేం’ అని ఎద్దేవా చేశారు.
మరోవంక, కేంద్రం కూడా ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్లో బ్లాక్ చేయాలంటూ యూట్యూబ్, విటర్లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసింది.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’