విద్వేష రాజకీయాలను లక్ష్యంగా భారత్ జోడో యాత్ర

విద్వేష రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర  చేస్తున్నట్లు  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో విద్వేషం వ్యాపించిందని చెప్తున్నవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మధ్య ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, దేశంలో విద్వేషం ఉందని చెప్తూ, భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని తాను ఓ ప్రశ్న అడుగుతున్నానని చెప్పారు. ఈ దేశంలో విద్వేషానికి ఎవరు జన్మనిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారూ, మీకేం జరిగింది? అని అడిగారు.

మన సైనికుల ధైర్య, సాహసాలను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, భారత దేశం ముక్కలైన దేశమా? దానిని ఏకం చేయడానికి? అని నిలదీశారు. భారత దేశం 1947లో విభజనకు గురైందని, ఇక మీదట ముక్కలు కాబోదని స్పష్టం చేశారు. ఎవరు పడితే వారు వచ్చి వాటా కోరడానికి అనువైన దేశంగా ఇక మీదట ఉండబోదని తేల్చి చెప్పారు.

భారత దేశ ఔన్నత్యానికి విఘాతం కలుగకూడదని కరాఖండీగా చెప్పారు. ‘రాహుల్ గాంధీ గారూ, దేశ కీర్తి, ప్రతిష్ఠలను నాశనం చేయడానికి ప్రయత్నించకండి’ అని హితవు పలికారు. రాజకీయాలు కేవలం ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి కాదని, సమాజాలను సృష్టించడానికని చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి అంతానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని, 2047 నాటికి సంపన్న దేశంగా అభివృద్ధి చెందుతుందని తనకు నమ్మకం ఉందని భరోసా వ్యక్తం చేశారు.