జీ20 సమావేశాల భద్రతపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష

గ్రేటర్ హైదరాబాద్ లో  నెల 28 నుంచి జూన్‌ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై డీజీపీ అంజనీ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని జి20 సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు.

డీజీపీ అంజనీ కుమార్ అధ్యక్షతన జి20సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది.  రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు సి.ఎస్.ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇందుభూషణ్ లెంక, ఎన్.డి.ఆర్.ఎఫ్. దామోదర్ సింగ్, సి.ఐ.ఎస్.ఎఫ్‌కు చెందిన సింగన రామ్, ఎన్.ఎస్.జి కి చెందిన కల్నల్ అలోక్ బిస్త్, జిఎడి ప్రోటోకాల్ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జి20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం జరుగనుందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్  లో ఆరు సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల 28న తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు.

మార్చిలో 6 , 7, ఏప్రిల్ లో 26 , 27, 28, జూన్ లో 7,8,9, జూన్ లో 15 , 16,17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారుల నుండి స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అని చెప్పారు.

సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున  ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, వీఐపీలు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.

ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని డీజీపీ ఆదేశించారు. ఎయిర్ పోర్టుతో పాటు నగరంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కోరారు.