బీజేపీని, ప్రధాని మోదీని తిట్టడానికేనా ఖమ్మంలో బిఆర్ఎస్ సభ!

ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్వహించిన సభ కేవలం బీజేపీని, ప్రధాని మోదీని తిట్టడానికే పెట్టినట్టుగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే, బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాల తిట్లే ఆశీర్వాదంగా బీజేపీ బలోపేతమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఎంత తిడితే తెలంగాణ ప్రజలు అంత దగ్గరవుతారని స్పష్టం చేశారు. మొత్తంగా ఖమ్మం సభలో కేసీఆర్ సహా హాజరైన నేతల ప్రసంగాలు కొండను తవ్వి తొండను పట్టినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

తొమ్మిదేళ్లు ప్రజలను కలవకుండా ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా అహర్నిశలు దేశం కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీ గురించి మాట్లాడ్డం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ధ్వజమెత్తారు. కేసీఆర్ తానొక ముఖ్యమంత్రి అన్న విషయం మరచి దేశంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయం కోసం బీజేపీని విమర్శిస్తే తప్పేమీ లేదని, కానీ దేశాన్ని కించపరిచేలా, తక్కువ చేసి చూపేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల స్థైర్యం దెబ్బతినేలా, వారిని కించపరిచేలా మాట్లాడారని గుర్తుచేస్తూ దేశాన్ని పాకిస్తాన్‌తో, అఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో పోల్చడాన్ని దేశ ప్రజలు సహించరని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

`మేకిన్ ఇండియా – జోక్ ఇన్ ఇండియా’ అంటూ ఎద్దేవా చేస్తున్న కేసీఆర్. 2014తో పోల్చితే దేశంలో తయారీ రంగం ఎన్ని రెట్లు పెరిగిందో చూడాలని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచమంతటా ఉత్పాదకత నిలిచిపోగా భారత్ వృద్ధి పథంలో దూసుకెళ్లిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా విద్యుత్ కొరత అన్నదే లేకుండా చేయడంలో కేంద్ర ప్రభుత్వానికే ముఖ్య పాత్ర అని తెలిపారు. 2014లో రక్షణ రంగ ఎగుమతులు రూ. 900 కోట్లు ఉంటే అవి ఇప్పుడు రూ. 15 వేల కోట్లకు పెరిగాయని, 75 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

అధికార దాహం తప్ప వేరే లక్ష్యంలేని కల్వకుంట్ల కుటుంబం దేశం లక్ష్యాన్ని కోల్పోయిందని విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 9 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరాత్మ మళ్లీ అధికారం ఎలా పొందాలనేదే తప్ప దేశం, సమాజం కోసం ఎంత మాత్రం కాదని ఆయన విమర్శించారు.

జల వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదంటూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొంటూ కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశానికి పిలిస్తే.. వాటికి రాకుండా డుమ్మాలు కొట్టి నింద కేంద్రం పైకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. సమావేశాలకు హాజరవడానికి సమయం దొరకని కేసీఆర్ కు.. ఏపీ ముఖ్యమంత్రితో కలిసి విందుభోజనాలు చేయడానికి మాత్రం సమయం ఉంటుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

అసెట్ మానిటైజేషన్ కు ప్రైవేటైజేషన్ కు తేడా ఉందని, భారీగా నష్టాల్లో ఉన్న కంపెనీల భారాన్ని పన్ను చెల్లింపుదారుల మీద పడకుండా ప్రైవేటైజేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఏడాదికి దాదాపు రూ. 800 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్న ఎయిర్ ఇండియా భారాన్ని ప్రజలపై మోపడం ఇష్టం లేక, ఎక్కడినుంచి తీసుకున్నామో తిరిగి ఆ సంస్థకే అప్పగించామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఎన్సీఆర్బీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఖమ్మం సమావేశంలో మాట్లాడిన వక్తలు బీఆర్ఎస్ శబ్దాన్ని కూడా ఉచ్ఛరించేందుకు ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ అర్థరహితమైన విమర్శలు చేస్తున్న కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కనీసం ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని నెట్టేశారని ధ్వజమెత్తారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా తమ డబ్బులు రాక ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

హాస్టళ్లలో విద్యార్థులు పురుగులు పడ్డ భోజనం చేయడం ఇష్టంలేక రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని గుర్తు చేశారు. తన మనవడు తినే భోజనమే హాస్టళ్లలో పెట్టాలని చెప్పిన కేసీఆర్, ఒకసారి తన మనవడిని హాస్టల్‌కు పంపితే అసలు విషయం తెలుస్తుందని సూచించారు.