తక్షణమే వేతన సవరణ సంఘం ఏర్పరచాలి

తక్షణమే వేతన సవరణ సంఘం (పి ఆర్ సి)ను ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుండి జీతాలు చెల్లించాలని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం  ఉద్యోగులు, ఉపాధ్యాయుల 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేస్తే ఆనాటి ప్రభుత్వం దిగి వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్రాసిన లేఖలో గుర్తు చేశారు.
 
పార్లమెంట్ లో బీజేపీ మద్దతుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది స్వరాష్ట్రం ఏర్పాటు కాగా, స్వరాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సి ఉండగా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి వారిని అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆయన విమర్సించారు.  ప్రతినెలా 1వ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కుగా ఉన్నప్పటికీ  సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
 
317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను చిన్నాభిన్నంచేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. పి ఆర్ సి
అమలు విషయంలోనూ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
 
స్వరాష్ట్రంలో సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పి ఆర్ సి నివేదికను  2018 జూలై 1 నుండి  అమలు చేయాల్సినప్పటికీ 21 నెలలు అమలు చేయకుండా, ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని సంజయ్ మండిపడ్డారు. “మీ కారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెంచిన జీతం అమలు కాకుండా 21 నెలలు నష్టపోయారు” అంటూ కేసీఆర్ ను నిలదీశారు.
 
ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి పి ఆర్ సి గడువు ముగియబోతోందని పేర్కొంటూ,  ఈ ఏడాది జూలై 1, 2023 నుండి కొత్త పి ఆర్ సి అమల్లోకి రావాలని గుర్తు చేశారు.  కానీ ఇప్పటి వరుకు మీరు కనీసం పి ఆర్ సి కమిషన్ ను కూడా  నియమించక పోవడం అన్యాయం, ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే అవుతుందని సంజయ్ స్పష్టం చేశారు.
 
వేతన సవరణ కమిషన్ నివేదిక లేకుండా పి ఆర్ సి ని ఎట్లా అమలు చేస్తారు? ని ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని చూస్తుంటే ఏదో విధంగా జాప్యం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి ని ఎగ్గోటాలనే ధోరణి కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.  ఈ విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సమర్ధనీయం కాదని స్పష్టం చేశారు.
 
ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త వేతన సవరణ కమిషన్ (పి ఆర్ సి)ని ఏర్పాటు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.  దీంతోపాటు 3 నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని ఈ ఏడాది జూలై నుండి కొత్త వేతనాలను అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో  ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.