మంత్రి పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు

ఏపీ రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరు నేత బోడె రామచంద్రయాదవ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి ఫిర్యాదు చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ఇటీవల పుంగనూరులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు తనను, తన కుటుంబాన్ని చంపడానికి దాడులు చేశారని అమిత్ షాకు వివరించారు.

జగన్ సర్కారు, వైసీపీపై ఎవరైనా ఆరోపణలు చేస్తే దాడులకు తెగబడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం రామచంద్ర యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ గత నెల డిసెంబర్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఎవరిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డిపై ఎఫ్ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి క్షీణించాయని ఆరోపించారు. ఏపీలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగానికి బదులు.. జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. తనపై జరిగిన దాడి గురించి అమిత్‌ షా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని రామచంద్రయాదవ్ తెలిపారు. విచారణ జరిపి దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. తనకు భద్రత కల్పిస్తామని హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

2019లో పుంగనూరు నుంచి జనసేన తరఫున పోటీ చేశానని రామచంద్ర యాదవ్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేశారని తెలిపారు. గత నెల 4న రైతు భేరి, రైతులపై చేస్తున్న దాడులపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే, ఆ మీటింగ్‌ జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సభ పెట్టుకోనివ్వలేదని చెప్పారు.