‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర యూనిట్ కు ప్రధాని అభినందనలు 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు దక్కినందుకుగాను చిత్రయూనిట్‌కి ప్రధాని నరేంద్రమోదీ  అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డుతో ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారని ఆయన తెలిపారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ.. ఆయన ట్వీట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అందులో.. ‘‘ఇదొక అద్భుతమైన విజయం!! కీరవాణి, ప్రేమ్‌ రక్షిత్‌, కాలభైరవ, చంద్రబోస్‌తోపాటు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రాహుల్ సిప్లీగంజ్‌తో పాటు ఆ మూవీ టీంకి నా అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో భారతీయులు అందరూ గర్వపడేలా చేశారు’ అని ఆయన పేర్కొన్నారు.
 
 ఇక ఈ అవార్డు దక్కించుకోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘అత్యున్నత ప్రపంచ వేదికల్లో మన కళకు గుర్తింపు లభించడం కంటే మన దేశం గర్వించదగిన సందర్భం మరొకటి ఉండదు’ అని ట్వీట్‌ చేశారు.
 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహితం చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేస్తూ … ” తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్‌ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము ” అని పేర్కొన్నారు.