మోదీపై కామెంట్ చేసేంత మొనగాళ్లా అయ్యారా కేటీఆర్!

మోదీపై కామెంట్ చేసేంత మొనగాళ్లా అయ్యారా కేటీఆర్!
ప్రియతమ మోదీగారిపై కామెంట్ చేసేంత మొనగాళ్లా అయ్యారా కేటీఆర్? అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. “మీరు, మీ అయ్య మోదీ గారి కాలిగోటి కూడా సరిపోరు” అంటూ ఆమె ధ్వజమెత్తారు.
 
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లపై కేటీఆర్ చేసిన అనుచిత వాఖ్యల పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్న మీరు ముందుగా ఉద్యోగస్తులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇస్తలేరో సమాధానం చెప్పండి అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
 
నాలుగేళ్లుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలుసహా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పండి అంటూ ఆమె నిలదీశారు.  నరేంద్ర మోదీ గారు ఫ్రీ రేషన్ ఇచ్చినప్పటికె నువ్వు ఇంకా ప్రజలకు ఎందుకు ఇయ్యట్లేదు? దానికి సమాధానం చెప్పండి అంటూ ఆమె ప్రశ్నించారు.
 
రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు అదనంగా ఎన్ని ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చినారో ప్రజలకు జవాబు చెప్పండని ఆమె డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్లో జమ చేసిన నిధుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు దొంగతనం చేశారో సమాధానం చెప్పమని అరుణ నిలదీశారు.
 
సిగ్గులేకుండా రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న మీకు మోదీ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు అని, ఆయనకు భారతదేశమే కుటుంబం అని ఆమె తెలిపారు. 0
 
మీది అవినీతి కంపులో దొర్లుతున్న కుటుంబం అంటూ మీ చెల్లె లిక్కర్ స్కామ్ లో, మీరు డ్రగ్ స్కాం లో, మీ అయ్య కాళేశ్వరం స్కామ్ లో… టోటల్ గా మీ ఫ్యామిలీ స్కాముల్లో కూరుకుపోయిన దొంగలని అరుణ మండిపడ్డారు. ఏదో ఒక రోజు మీరంతా ఒకే చోట చిప్పకూడు తినడం ఖాయం అంటూ ఆమె స్పష్టం చేశారు.
 
 మూడేళ్ల నుండి కేంద్రానికి తెలంగాణ రూ.3.68 లక్షల కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చెప్పడాన్ని ఆమె ఎద్దేవా చేశారు.  ఆ రోజు నుంచి ప్రజలు ఇంకా పనులు కట్టడంలేదా? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులివ్వడం లేదని మీరు చెప్పడం సిగ్గు చేటు అంటూ కళ్ళు లేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
 
తెలంగాణలో కేవలం జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టిన ఘనత కేంద్రానిదే అని అరుణ తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందనే విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని రెండేళ్లుగా సవాల్ విసురుతున్నామని, అయినా నేటికీ చర్చకు రాని మీరు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టడం సిగ్గు చేటని ఆమె కొట్టిపారేశారు.
 
డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పుడు సందర్భంగా మీరు డ్రగ్స్ తీసుకున్నారని, దమ్ముంటే శాంపిల్ ఇవ్వాలని రెండేళ్ల కిందనే మేము డిమాండ్ చేస్తే నాడు మౌనంగా ఉన్న మీరు,  దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మోరిగినట్లుగా డ్రగ్స్ ఆనవాళ్లు పూర్తిగా మాయమయ్యాయని నిర్దారించుకున్న తరువాత వచ్చి చాలెంజ్ చేయడాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని ఆమె విమర్శించారు.
 
మొన్నటి సెస్ ఎలక్షన్లో బీజేపీ నాయకులు మీకు ట్రైలర్ మాత్రమే చూపించారని అంటూ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సిరిసిల్లలో మీకు అసలు సిసిలు సినిమా చూపిస్తామని ఆమె హెచ్చరించారు.  సెస్ ఎన్నికల్లో గెలుపు కోసం నీవు ఎన్ని నువ్వు ఎన్ని అడ్డదారులు తొక్కినవో యావత్ తెలంగాణ సమాజం చూసిందని ఆమె చెప్పారు. బిజెపి గెలిచిన సీటును కూడా నిర్లజ్జగా తారుమారు చేసి మీ ఖాతాలో కలుపుకున్న దుర్మార్గులు మీరుని ఆమె మండిపడ్డారు
 
వేములవాడ దేవాలయానికి ఏటా 100 కోట్లు చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని మీ అయ్య హామీ ఇచ్చి ఏడేళ్లు కావొస్తుందని చెబుతూ ఆ నిధులిస్తవో ప్రజలకు సమాధానం చెప్పండని అరుణ ప్రశ్నించారు.   ‘ప్రసాద్’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే వేములవాడ ఆలయ అభివ్రుద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని బండి సంజయ్  మూడేళ్లుగా కోరుతున్నా ఇంతవరకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదో సమాధానం చెప్పండని ఆమె నిలదీశారు.
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం మొట్టికాయ వేసినా మీలో ఇంకా మార్పు రాకపోవడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు.