ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి డా. జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారని, వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని ఆయన తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన యువజన ప్రవాసీ భారతీయ దివస్ సభలో ఆదివారం మంత్రి మాట్లాడుతూ చెప్పారు.
విదేశాలలో నివసిస్తున్న భారతీయ సామాజిక వర్గానికి విశిష్టత ఉందని, ఇప్పుడు జరుగుతోన్న ఈ తరహా ప్రవాసీ భారతీయ దినోత్సవాలతో వారి పట్ల మనకున్న భారతీయ బంధం, వారికి భారత్కు ఉన్న అనుబంధం మరింత పటిష్టం అవుతుందని జైశంకర్ తెలిపారు.
ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులు అత్యధిక సంఖ్యలో విదేశాలలో ఉన్నారని, పైగా ప్రతిభావంతులు అని చెబుతూ ఎన్నారైలు భారత్కు మిగిలిన ప్రపంచానికి మధ్య వారధులుగా మారారని తెలిపారు. పలు దేశాల నుంచి యువజన ప్రతినిధులు ఈ సభలకు తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఇండోర్లో ఈ సభలు జరుగుతాయి.
సభలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్ జనేటా మస్కరేన్హస్ హాజరయ్యారు. మన సంతతివారు ఈ భారత అమృతకాలంలో భారతీయ ప్రగతి దిశలో విశ్వసనీయ భాగస్వాములు అనే ఇతివృత్తంతో ఈ 17వ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సదస్సు చేపట్టారు.
More Stories
జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మత ప్రాతిపాదక రిజర్వేషన్లు
అన్నామలైకి సుప్రీంకోర్టులో ఊరట