జరిమానాలో 10 శాతం గూగుల్  డిపాజిట్ చేయమన్న ట్రిబ్యునల్

కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాలో పదిశాతం డిపాజిట్‌ చేయాలని ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ను నేషనల్‌ కంపెనీ లా అప్పినేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
 
సీసీఐ ఆదేశాలను సవాల్‌ చేస్తూ గూగుల్‌ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ట్రిబ్యునల్‌ అంగీకరించింది.  గూగుల్ పిటిషన్‌పై స్పందన కోరుతూ సీసీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను విచారినకు స్వీకరించిన ఎన్సీల్యాట్‌.. బోనాఫైడ్‌ను చూపేందుకు జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని గూగుల్‌ను కోరింది.
 
కాగా, సీసీఐ పెనాల్టీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ట్రిబ్యునల్‌ నిరాకరించింది. వాదనలు విన్నాక పూర్తిస్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ట్రిబ్యునల్‌ పేర్కొంది. ఈ మేరకు సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.ఆండ్రాయిడ్‌ వల్ల భారత యూజర్లు, మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని, భారత డిజిటల్‌ ప్రయాణంలో ఆండ్రాయిడ్‌ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. సీసీఐ ఉత్వర్వులతో ఆ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గూగుల్‌ ఎన్సీల్యాట్‌కు విన్నవించింది. దేశంలో ఎలాంటి విచారణా జరపకుండా యూరోపియన్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను సీసీఐ డైరెక్టర్‌ జనరల్‌ కాపీ కొట్టారని ఆరోపిస్తూ.. సీసీఐ ఆదేశాలను కొట్టివేయాలని కోరింది.