400 మంది రష్యా సైనికులపై ఉక్రెయిన్ క్షీపనుల దాడి

ర‌ష్యాను చావుదెబ్బ తీసింది ఉక్రెయిన్‌. తాజాగా ఉక్రెయిన్ జ‌రిపిన మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆక్ర‌మిత డోన‌స్కీ ప్రాంతంలో ఆ క్షిప‌ణి దాడి జ‌రిగింది. మ‌కీవ్‌కా న‌గ‌రంలో ఉన్న ఓ బిల్డింగ్‌ను మిస్సైల్ టార్గెట్ చేసింది.  ఆ బిల్డింగ్‌లో ర‌ష్యా ద‌ళాలు ఉంటున్న‌ట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ ర‌ష్య‌న్ అధికారులు ఆ దాడిని ద్రువీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

కీవ్‌లో ఆదివారం రాత్రి వైమానిక దాడులు జరిగాయి. రష్యా తాజాగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దొనేత్సక్‌లోని ఆక్రమిత భాగాలలో రష్యా మద్దతు ఉన్న సీనియర్ అధికారి డానిల్ బెజ్సోనోవ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజున అర్ధరాత్రి రెండు నిమిషాల తర్వాత క్షిపణి మికివ్కా నగరంను తాకిందని తెలిపారు.

‘అమెరికన్ ఎంఎల్‌ఆర్‌ఎస్ హిమార్స్ నుంచి వృత్తి విద్యా పాఠశాలకు భారీ దెబ్బ తగిలింది’ అని ఆయన తెలిపారు. ‘చాలా మంది చనిపోయినవారు, గాయపడినవారున్నారు…కానీ ఖచ్చితమైన సంఖ్య మాత్రం తెలియదు’ అని బెజ్సోనోవ్ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’లో పోస్ట్ పెట్టారు.

రష్యన్ ప్రెజెంటర్ వ్లాదిమిర్ సోలోవియోవ్ టెలిగ్రామ్‌లో ‘ప్రాణ నష్టం గణనీయంగా ఉంది…దాదాపు 400 వరకు చనిపోయి ఉండొచ్చు’ అని రాశారు. కాగా ఉక్రెయిన్ మిలిటరీ ప్రకారం 400 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారు.

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో యుద్ధం మొద‌లైన నాటి నుంచి డోన‌స్కీ ప్రాంతంలో ఉన్న ర‌ష్యా ద‌ళాల్ని ఉక్రెయిన్ టార్గెట్ చేస్తూనే ఉంది. అక్కడ ఉన్న న‌గ‌రాల‌పై దాడులు కొన‌సాగిస్తోంది. గ‌త ఏడాది ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది సాధార‌ణ పౌరులు మ‌ర‌ణించిన‌ట్లు ర‌ష్యా అధికారులు చెబుతున్నారు.