చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై  పలు దేశాల ఆంక్షలు

చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొన్ని దేశాలు నిబంధనలు, మరికొన్ని దేశాలు నిషేధం విధించాయి. అందులో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి చైనా నుంచి  అమెరికాకు వచ్చే ప్రయాణికులు రెండు రోజుల్లోగా కరోనా రిపోర్టును అందజేయాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. లేదంటే గతం 90 రోజుల క్రితం వైరస్ నుంచి కోలుకున్నానని రుజువు చేసే డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించారు.

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. పీసీఆర్ లేదా ఆంటిజెన్ సెల్ఫ్ టెస్టులను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. జనవరి 5 నుండి  చైనా నుండి ఫ్రాన్స్‌కు చేరుకునే వారందరూ తప్పనిసరిగా నెగటివ్ పీసీఆర్ పరీక్ష లేదా రాపిడ్ యాంటిజెన్ పరీక్షను సమర్పించాలని అధికారులు ఆదేశించారు. అది కూడా వారి విమాన ప్రయాణానికి 48 గంటల కంటే ముందే అయినదై ఉండాలని చెప్పారు.

ఇటలీ, స్పెయిన్ కూడా కొవిడ్ పరీక్ష నిబంధనలను విధించాయి. ఈ విషయంపై చర్చించేందుకు యూరోపియన్ దేశాలు ఉమ్మడిగా ఈ వారం సమావేశం కానున్నాయి ఆస్ట్రేలియా కూడా చైనా నుంచే కాకుండా హాంకాంగ్, మకావు నుంచి వచ్చే ప్రయాణికులకు సైతం కొన్ని నిబంధనలు విధించింది. తమ దేశానికి వచ్చే ముందే కరోనా పరీక్ష రిపోర్టును అందించాలని కోరింది.

ఇక చైనా నుండి కెనడాకు వచ్చే ప్రయాణికులను తామ బయలుదేరే ముందు రెండు రోజుల కంటే ముందు కొవిడ్ టెస్టు చేయించుకున్న రిపోర్టును అందించాలని ఆదేశించింది. నెగిటివ్ రిపోర్టు ఉన్నవారికే తమ దేశంలోకి ఎంట్రీ అని చెప్పింది. ఇదే  బాటలో ఇజ్రాయిల్ కూడా నడుస్తోంది. చైనా నుంచి ప్రయాణికులకు కరోనా టెస్ట్ తప్పనిసరి చేసింది. స్ర్కీనింగ్ సెంటర్లలో ఎవరైతే తమకిష్టమైతే టెస్టు చేయించుకోవచ్చని తెలిపింది.

చైనా నుండి వచ్చేవారిపై కొత్త నిబంధనలను విధించిన మొదటి దేశాలలో జపాన్ ఒకటి. వారు నెగెటివ్ కొవిడ్ పరీక్షను సమర్పించవలసి ఉంటుందని ఆ దేశం నిబంధనలు విధించింది. పాజిటివ్ వచ్చిన వారు ఏడు రోజుల పాటు నిర్దేశిత సౌకర్యాలతో క్వారంటైన్ చేయబడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో టోక్యో ప్రధాన భూభాగం చైనా నుండి వచ్చే విమానాలపైనా దృష్టి సారించింది.

 ఇక చైనా లేదా ఇతర ఆసియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులందరూ ఇండియాకు బయలుదేరిన 72 గంటలలోపు నెగెటివ్ కోవిడ్ పరీక్షను అందించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది. చైనా నుండి వచ్చే ప్రయాణికులందరికీ పూర్తిగా ప్రవేశాన్ని నిషేధించింది. ఈ నిబంధన జనవరి 3 నుండి అమలులోకి వస్తుందని, అంతే కాకుండా తదుపరి నోటీసు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని చెప్పింది. కొవిడ్ ను నివారించాలని, కొత్త కేసుల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశవిదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.