రికార్డు స్థాయిలో రూ.1,446 కోట్ల టిటిడి ఆదాయం

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో 2022లో హుండీ ఆదాయం రూ.1,446 కోట్లు సమకూరింది. ఈ సంవత్సరం 2.36 కోట్ల మంది   భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 1.09 కోట్ల మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. 11.43 కోట్లు లడ్డూలను భక్తులకు టిటిడి విక్రయించింది.

కరోనా ఆంక్షలను 2022 మార్చినుంచి తొలగించడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రానురాను పెరుగుతోందని టిటిడి అధికారులు తెలిపారు. కాగా కొత్త సంవత్సరం జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల పుణ్య క్షేత్రానికి భారీగా భక్తులు తరలి రానున్నారు. దీంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు పలు సూచనలను టిటిడి చేసింది. వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచనున్నారు. సుమారు 8 లక్షల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పని సరిగా మాస్సులు ధరించి, వ్యక్తిగత నియంత్రణ, శానిటైజేషన్ పాటించాలని టిటిడి అధికారులు కోరారు.

దుర్గమ్మ ఆదాయం కోటిన్నర

కాగా, విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భవానీ దీక్షల విరమణల ద్వారా కోటిన్నర ఆదాయం సమకూరింది. భక్తుల కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇవో భ్రమరాంబ తెలిపారు. ఇటీవల ముగిసిన ఐదు రోజుల భవానీ దీక్షల విరమణలో ఈ ఆదాయం వచ్చింది ఆమె వెల్లడించారు. అంచనాల ప్రకారం 5.40 లక్షల  మంది భక్తుల భవానీ దీక్ష విరమణ సమయంలో ఆమ్మవారిని దర్శించుకున్నారని ఆమె తెలిపారు.