సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా  అర్వింద్ 

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్ సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి,   బాలశౌరి వల్లభనేని (మచిలీపట్టణం)లు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని, దాని ద్వారా బోర్డు 30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి ఆమోదించిందని తెలిపారు.
 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్ ను ఈ మూడేళ్ల కాలానికే తెచ్చుకున్నామని, అందులో నుండి ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని ఆయన పేర్కొన్నారు. బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడం పట్ల ఎంపీ స్పందిస్తూ , దీని వలన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంత పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 ఈ సందర్భంగా పసుపు, మిర్చి పంటల రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మరింతగా కృషి చేస్తానని  అర్వింద్ పేర్కొన్నారు. బోర్డు సభ్యునిగా తన ఎన్నికకు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు.