సామాజిక పురోగతి సూచికలో అగ్రగామిగా పుదుచ్చేరి, లక్షదీప్‌, గోవా 

సామాజిక పురోగతి సూచిక (ఎస్‌పిఐ)లో  పుదుచ్చేరి, లక్షదీప్‌, గోవా   అగ్రగామిగా నిలిచాయి. పెద్ద రాష్ట్రాలలో తమిళనాడు, కేరళ ముందుండగా, అస్సాం, బీహార్‌, జార్ఖండ్‌, రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 23వ ర్యాంక్‌లోనూ, తెలంగాణ 26వ ర్యాంక్‌లోనూ నిలిచాయి. 

దేశంలోని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకుసంబంధించిన సోషల్‌ ప్రోగ్రస్‌ ఇండెక్స్‌ (ఎస్‌పిఐ) నివేదికను ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఇఎసి-పిఎం) విడుదల చేసింది. ప్రాథమిక మానవ అవసరాలు, ప్రజా శ్రేయస్సు పునాదులు, అవకాశాలు వంటి మూడు కీలక కోణాల్లో సామాజిక పురోగతికి సంబంధించిన 12 విభాగాల ఆధారంగా రాష్ట్రాలు, జిల్లాలను సూచిక అంచనా వేస్తుంది. 

రాష్ట్ర స్థాయిలో 89, జిల్లా స్థాయిలో 49 అంశాలతో కూడిన విస్తృత ప్రాతిపదికన ఈ సూచికను రూపొందించారు. ఈ సూచిక ప్రాథమిక మానవ అవసరాల్లో పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణ, తాగు నీరు, పారిశుధ్యం, వ్యక్తిగత భద్రత, ఆశ్రయం వంటి అంశాల్లో రాష్ట్రాలు, జిల్లాల పనితీరును అంచనా వేసింది. ప్రజా శ్రేయస్సు పునాదుల్లో ప్రాథమిక విజ్ఞాన సదుపాయం, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ యాక్సెస్‌, ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్‌ అండ్‌ వెలొస్‌), పర్యావరణ నాణ్యత వంటి అంశాల్లో దేశం పురోగతిని అంచనా వేసింది. 

అవకాశం విభాగంలో వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక, సమగ్రత, అధునాతన విద్య అందించడం వంటి అంశాలపైనా దృష్టి పెట్టింది. ఆరు విభాగాలుగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులను కేటాయించింది.

పుదుచ్చేరి (65.99 స్కోర్‌), లక్షదీప్‌ (65.89 స్కోర్‌), గోవా (65.53 స్కోర్‌), సిక్కిం (65.10 స్కోర్‌), మిజోరం (64.19 స్కోర్‌), తమిళనాడు (63.28 స్కోర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ (63.28 స్కోర్‌), చండీగఢ్‌ (62.37 స్కోర్‌), కేరళ (62.05 స్కోర్‌) చాలా అధిక సామాజిక పురోగతి విభాగంలో నిలిచాయి. 

ఇందులో పుదుచ్చేరి, లక్షదీప్‌, చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలు కాగా, గోవా, సిక్కిం, మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌ చిన్న రాష్ట్రాలు. పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ మాత్రమే చాలా అధిక సామాజిక పురోగతి సాధించిన వాటిలో ఉనాుయి.

జమ్ముకాశ్మీర్‌ (60.76 స్కోర్‌ ), పంజాబ్‌ (60.23 స్కోర్‌), దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ (59.81 స్కోర్‌), లడఖ్‌ (59.53 స్కోర్‌), నాగాలాండ్‌ (59.24 స్కోర్‌), అండమాన్‌ నికోబార్‌ దీవులు (58.76 స్కోర్‌) అధిక సామాజిక పురోగతి సాధించాయి. ఇందులో పంజాబ్‌, నాగాలాండ్‌ మినహాయిస్తే మిగిలినవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉనాుయి.

ఉత్తరాఖండ్‌ (58.26 స్కోర్‌), కర్ణాటక (56.77 స్కోర్‌), అరుణాచల్‌ ప్రదేశ్‌ (56.56 స్కోర్‌), ఢిల్లీ (56.28 స్కోర్‌), మణిపూర్‌ (56.27 స్కోర్‌)తో అప్పర్‌ మిడిల్‌ సోషల్‌ ప్రోగ్రెస్‌ విభాగంలో నిలిచాయి.

దిగువ మధ్య సామాజిక ప్రగతి విభాగంలోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. హర్యానా (54.15), గుజరాత్‌ (53.81), ఆంధ్రప్రదేశ్‌ (53.60), మేఘాలయ (53.22), పశ్చిమ బెంగాల్‌ (53.13), తెలంగాణ (52.11), త్రిపుర (51.70), ఛత్తీస్‌గఢ్‌ (51.36), మహారాష్ట్ర (50.86), రాజస్థాన్‌ (50.69) రాష్ట్రాలు లోయర్‌ మిడిల్‌ సోషల్‌ ప్రోగ్రెస్‌ విభాగంలో నిలిచాయి.

ఉత్తర ప్రదేశ్‌ (49.16 స్కోర్‌), ఒరిస్సా (48.19 స్కోర్‌), మధ్యప్రదేశ్‌ (48.11 స్కోర్‌) రాష్ట్రాలు తక్కువ సామాజిక పురోగతినిసాధించాయి. అస్సాం (44.92), బీహార్‌ (44.47), జార్ఖండ్‌ (43.95)లు చాలా తక్కువ సామాజిక పురోగతిని సాధించాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది.