డైరెక్ట్ టు మొబైల్ (డీ-టు-ఎం) బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం పరిశోధన దశలో ఉందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాతపూర్వకంగా జవాబిచ్చారు.
టెలివిజన్ కార్యక్రమాలను నేరుగా స్మార్ట్ ఫోన్లకు ప్రసారం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ, కాన్పూర్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. డీ-టు-ఎం టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కోసం ప్రసారభారతి ఐఐటీ, కాన్పూర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జూన్ 1న నిర్వహించిన సమావేశంలో ఐఐటీ, కాన్పూర్ డీ-టూ-ఎం టెక్నాలజీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీని పరీక్షించడానికి బెంగుళూరులో లైవ్ పీఓసీ టెస్టింగ్ సైట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భారతదేశ శాటిలైట్ టీవీ ఛానల్స్ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ పాలసీ మార్గదర్శకాల ప్రకారం విదేశీ కంపెనీకి చెందిన శాటిలైట్ ఛానల్ ఏదైనా ఆమోదం పొందిన టెలీపోర్ట్ ఆపరేటర్ సహాయంతో తమ కార్యక్రమాలను భారత్ నుంచి అప్లింక్ చేసుకోవచ్చు. తద్వారా విదేశాల్లో ఆ కార్యక్రమాలను డౌన్లింక్ చేసుకుని వీక్షించవచ్చని పేర్కొన్నారు.
వార్షిక అనుమతి రుసుము చెల్లించడం ద్వారా అటువంటి విదేశీ ఛానల్స్ ఇండియన్ టెలీపోర్టు నుంచి తమ కార్యక్రమాలను అప్లింక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని వలన ఇండియన్ టెలీపోర్ట్ ఆపరేటర్లకు వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే దేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. భారత్ భవిష్యత్తులో అప్లింకింగ్ హబ్గా అవతరిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
కాగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను విస్తృతం చేస్తూ వాటిలో సమర్దత సాధించే లక్ష్యాలతో జాతీయ క్రీడా విధానాన్ని రూపొందించినట్లు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖ రూపొందించిన అనేక పథకాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడతాయని మంత్రి తెలిపారు.
త్వరలో ఇంగ్లండ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ను ఇంగ్లండ్ రాణి లేదా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులు ప్రారంభించనున్న కారణంగా భారత్ ఆ పోటీల నుంచి వైదొలగే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అటువంటి ఆలోచనేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
జూన్ 4 తర్వాత కూటమి విచ్ఛిన్నం ఖాయం
కేజ్రీవాల్ ప్రసంగంపై ఈడీ అభ్యంతరం