ఐఫోన్‌ తదుపరి తయారీ కేంద్రాలుగా భారత్‌, వియత్నాం

చైనా ఎదుర్కొంటున్న భౌగోళిక, రాజకీయ, ఆరోగ్య సవాళ్ల నేపథ్యంలో ఐఫోన్‌ తదుపరి తయారీ కేంద్రాలుగా భారత్‌, వియత్నాం రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చి విశ్లేషకులు ఇవాన్‌ లామ్‌, షెన్‌ఘావో బాయి అభిప్రాయపడ్డారు. కీలక ఎలక్ట్రానిక్స్‌ తయారీదారులు స్థానిక ప్రోత్సాహక విధానాల ప్రయోజనాన్ని పొందుతూ ప్రపంచ వ్యాప్తంగా, ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే దిశగా వేగంగా కదులుతున్నారు.

కరోనాకు ముందు ప్రారంభమైన మల్టి ఇయర్‌ ప్రయత్నం, ఆర్థికంగా లాక్‌డౌన్లు చైనాను అస్థిరపరిచాయి. చైనా ప్రముఖ భాగస్వామ్య సంస్థ హన్‌ హై (ఫాక్స్‌కాన్‌) ప్రొసిజన్‌ ఇండస్ట్రీ కంపెనీ తన సామర్థ్యంలో 30శాతం తయారీని బ్రెజిల్‌తోపాటు ఇతర ఆసియా దేశాలకు తరలించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికిప్పుడు చైనాకు ప్రత్యామ్నాయం లేనప్పటికీ, సమీపకాలంలో భారత్‌, వియత్నాం దేశాలు ఈ అవకాశాల్ని అందిపుచ్చుకుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌ నేతృత్వంలోని కంపెనీలు ఇప్పటికే భారత్‌లో ఫ్యాక్టరీల ఏర్పాటు, ఉత్పత్తి మార్గాలు, సాపేక్షంగా అధునాతన తయారీ ప్రక్రియలు, సిబ్బంది శిక్షణ కోసం పెట్టుబడులు పెట్టాయని వారు పేర్కొన్నారు. విస్తృత మానవ వనరులు, అధిక జననరేటు వంటి అంశాలు ఐఫోన్‌ తుది ఉత్పత్తులకు ఆకర్షణీయమైన మార్కెట్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

భారతదేశంలో తయారైన స్మార్ట్‌ ఫోన్లు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇది 44 మిలియన్‌ యూనిట్లకు పైగా చేరుకుంది. ప్రపంచ బ్యాంక్‌ డేటా ప్రకారం చైనా, తన వంతుగా 2020 నుంచి శ్రామిక శక్తిని తగ్గించింది. విద్యావంతులు, నైపుణ్య శిక్షణ కలిగిన కార్మిక శక్తి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా ఎదుగుదలకు ఇంతకాలం వెన్నెముకగా ఉంది.

ఆపిల్‌ తన ఐఫోన్‌ ఉత్పత్తి రూపకల్పనను మరింత మాడ్యులర్‌గా చేయడం ద్వారా, వ్యక్తిగత కర్మాగారాలు లేదా నైపుణ్యం కలిగిన కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి తన వంతు కృషి చేసిందని కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. కొత్త ఉత్పత్తి అసెంబుల్డ్‌ నిర్వహణ, విస్తరణ సౌలభ్యంపై కంపెనీ దృష్టిపెట్టింది.

విశ్లేషకుల ప్రకారం, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌ మోడల్‌లతో తయారీ శ్రమ గణనీయంగా తగ్గింది. ఇప్పుడు భారతదేశంలోని ప్లాంట్లు చైనాలోని ప్లాంట్లు దాదాపు ఏకకాలంలో ఐఫోన్‌ 14ను ఉత్పత్తి చేయడం సాధ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. గతంతో పోలిస్తే, యాఫిల్‌ తన ఐఫోన్‌ ఉత్పత్తిని భారత దేశంలో ఈ సంవత్సరం చాలా వేగంగా ప్రారంభించింది.