భారత నౌకాదళం అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ మర్ముగోవా

యుద్ధ నౌక మర్ముగోవా భారత నౌకాదళం అమ్ములపొదిలోకి చేరింది. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని జల ప్రవేశం చేయించారు. ఇది ఒక స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. 75 శాతం స్వదేశీంగా తయారైంది. 

ఇది మన నౌకాదళ సామర్ధ్యాన్ని పెంపొందించడంతో పాటు మన రక్షణ పాటవాన్ని ఇనుమడింప చేస్తుందని రక్షణ మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో మనం అమలు పరుస్తున్న `ఆత్మనిర్భర్ భారత్’కు ఇదొక్క నిదర్శనం అని పేర్కొన్నారు.  , ప్రపంచంలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యుద్ధనౌకల్లో ముర్ముగోవ్ ఒకటని తెలిపారు. 

స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని, ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా ఇందులోని వ్యవస్థలు తీర్చగలవని రక్షణ మంత్రి చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానం కలిగిన నౌకల తయారీ కేంద్రంగా ఇండియాను తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని పేర్కొంటూ ఇతర దేశాలకు కూడా నౌకానిర్మాణాలు చేసిపెడతామని తెలిపారు.

స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకల తయారీ చరత్రలో క్షిపణి విధ్వంసక ముర్ముగోవ్ జలప్రవేశం ఒక మైలురాయి అని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. ఏడాది క్రితమే విశాఖపట్నంలో ముర్ముగావ్ యుద్ధనౌకను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత దశాబ్దంగా వార్ షిప్ తయారీ, నిర్మాణ సామర్థ్యం దిశగా పడిన కృషికి ముర్ముగోవ్ నిదర్శనమని పేర్కొన్నారు. చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట యుద్ధనౌకకు నామకరణం చేశామని చెప్పారు.

ఇది పీ 15 బ్రావో తరగతికి చెందిన రెండో నౌక. ఐఎన్‌ఎస్ మర్ముగోవా మన దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకగా పేర్కొంటున్నారు. ఈ నౌకలో అన్ని రకాల ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. 

పీ 15 బీ క్లాస్‌ నౌకలు నాలుగు విశాఖపట్నం, మర్ముగోవా, సూరత్‌, ఇంఫాల్‌లో ఉన్నాయి. గత ఏడాది విశాఖలో ఒకటి జలప్రవేశం చేయగా.. ఇంఫాల్‌, సూరత్‌లోని నౌకలు త్వరలోనే నౌకాదళంలో చేరనున్నాయి. ఈ యుద్ధనౌకకు ఓడ రేవు నగరం గోవా పేరు పెట్టారు. 

పోర్చుగీస్ పాలన నుంచి గోవా స్వాతంత్ర్యం పొంది 60 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గత ఏడాది డిసెంబర్ 19న మర్ముగోవా తన తొలి సముద్రయానం చేసింది. డిసెంబర్ 18న గోవా విమోచన దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించారు. ఈ ఓడ పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, 7,400 టన్నుల బరువు కలిగి ఉన్నది.

యుద్ధనౌక మర్మ గోవాలో బ్రహ్మోస్, బరాక్-8 వంటి క్షిపణులు ఉన్నాయి. నాలుగు గ్యాస్ టర్బైన్ల సాయంతో ఇది 30 నాట్స్‌ కంటే ఎక్కువ వేగాన్ని సాధించగలదు. అణు, జీవ. రసాయన యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండేలా దీనిని తయారు చేశారు. ప్రాజెక్ట్ 15 బీ కింద నిర్మించిన క్షిపణి విధ్వంసక యంత్రాల నాణ్యత అమెరికా, ఐరోపా నౌకానిర్మాణదారులతో ఈ నౌక పోటీ పడుతుండటం విశేషం.