ఈశాన్యం చివరి ‘మైలు’ కాదు, ‘మెయిన్ పిల్లర్’

ఈశాన్యం చివరి ‘మైలు’ కాదని, ‘మెయిన్ పిల్లర్’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే శత్రుదేశానికి ప్రయోజనం చేకూరుతుందని గత ప్రభుత్వం ఆలోచించేదని, తాము మాత్రం సరిహద్దు ప్రాంతాలను కంచుకోటల్లా మార్చేందుకు పట్టుదలతో ఉన్నామని చెప్పారు. సరిహద్దు గ్రామాలకు మెరుగైన రోడ్ల అనుసంధానం కోసం పనిచేస్తున్నామని తెలిపారు.

షిల్లాంగ్‌ లోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆదివారంనాడు జరిగిన ఈశాన్య మండలి (ఎన్ ఇ సి) స్వర్ణోత్సవంలలో పాల్గొంటూ ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి లేమి, అవినీతి, అశాంతి, రాజకీయ వివక్ష వంటి అన్ని అవరోధాలకు బీజేపీ ప్రభుత్వం రెడ్‌కార్డ్  చూపించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన క్రీడాపరిభాషలో మాట్లాడుతూ, పుట్‌బాల్‌ ఆటలో క్రీడాస్ఫూర్తికి భిన్నంగా ఎవరైనా ఆడితే అతనికి ‘రెడ్‌కార్డ్’ చూపించి, బయటకు పంపేస్తారని, అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో గత 8 ఏళ్లలో అశాంతి, అభివృద్ధి లేమి, అవినీతి వంటి అవరోధాలకు రెడ్ కార్డ్ ఇచ్చి చెల్లుచీటీ చెప్పామని స్పష్టం చేశారు. 

కేంద్రంలోని గత ప్రభుత్వాలు విభజన ఈశాన్య విధానాన్ని అవలంభచగా, తాము డివైన్ అప్రోచ్‌తో వెళ్తున్నామని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లో విభేదాలను పరిష్కరించి శాంతి నెలకొనే దిశగా తాము కృషి సాగిస్తున్నామని తెలిపారు. ఈశాన్యంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దేశంలోనే తొలి జాతీయ క్రీడా యూనివర్శిటీ, 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయని చెప్పారు.

ఈశాన్య రాష్ట్రాలు జలవిద్యుత్ పవర్ హౌస్ గా మారగలవని ప్రధాని మోదీ చెబుతూ దీంతో  ఈ ప్రాంతంలోని రాష్ట్రాలు మిగులు విద్యుత్ రాష్ట్రాలుగా మారుతాయని తెలిపారు. దీంతో పరిశ్రమల విస్తరణకు దోహదపడుతుందని పీఎం చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి లభ్యం కానుందని పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆయన చెప్పారు.ఈ రాష్ట్రాల్లో టూరిజం సర్క్యూట్ ను అభివృద్ది చేస్తున్నామని పేర్కొంటూ  దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కనెక్టివిటిని పెంచే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. 014 నుండి జాతీయ రహదారులు 50 శాతం పెరిగినట్టుగా ప్రధాని చెప్పారు.

ఈశాన్య రాష్ట్రాలకు వాయుమార్గ అనుసంధానం పెంచామని పేర్కొంటూ 2014 ముందు కేవలం ఈశాన్యంలో వారంలో 900 విమానాలు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 1,900 విమానాలు తిరుగుతున్నాయని ప్రధాని వివరించారు.  మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ వల్ల క్రిషి ఉడాన్ యోజన ద్వారా రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు 2020లో ప్రారంభించిన కృషి ఉడాన్ యోజన పథకం ఎంతగానో ఉపకరిస్తోందని తెలిపారు.

ఈశాన్యంలో ఆరు వేల మొబైల్ టవర్లు ఏర్పాటు చేశామని చెబుతూ ఇందుకోసం ప్రభుత్వం రూ.5,000 కోట్ల వ్యయం చేసిందని ప్రధాని చెప్పారు. 150 ఏకలవ్వ స్కూల్ మోడల్స్‌ రాబోతున్నాయని, ఈశాన్య రాష్ట్రాల్లో పర్బత్ మేళ స్కీమ్, పీఎం డివైన్ ప్రాజెక్టు వంటి పథకాలపై దృష్టి సారించనున్నామని తెలిపారు.

గత ఏడాది వాటికల్ సిటీ వెళ్లిన విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, గత ఏడాది తాను వాటికన్ సిటీ వెళ్లి పోప్‌ను కలిసానని, ఆయనను భారత్ కు  ఆహ్వానించానని చెప్పారు. ఈ సమావేశం ప్రభావం తనపై ఎంతో ఉందని చెబుతూ  శాంతి, అభివృద్ధి రాజకీయాల వైపు తమ ప్రభుత్వం ప్రయాణం సాగిస్తోందని, ఇందువల్ల గిరిజన కమ్యూనిటీకి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.

కాగా, దీనికి ముందు నార్త్ ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.2,450కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌షా, 8 ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు పాల్గొన్నారు.