బయోమెడికల్ పరిశోధనలో కీలక శక్తిగా భారత్

21వ శతాబ్దపు బయోమెడికల్ పరిశోధనలో భారతదేశాన్ని ఒక కీలకమైన ప్రపంచ శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని ఐసీఎంఆర్ – ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ కలిగి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఐసీఎంఆర్ – ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ (నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్)ని  తెలంగాణ కార్మిక,  ఉపాధి శాఖ మంత్రి సి. మల్లా రెడ్డి సమక్షంలో ప్రారంభించారు.

మానవులు, జంతువులపై పరిశోధనలు జరిగే సమయంలో నైతిక విలువలు పాటించి తగిన సంక్షేమాన్ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించడం ద్వారా ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ దేశంలో ఆరోగ్య, సంక్షేమ రంగాల అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. 

స్వదేశీ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని డాక్టర్ మాండవీయ వివరిస్తూ కరోనా మహమ్మారి సమయంలో, ప్రపంచం వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న సమయంలో దేశ శాస్త్రవేత్తల సహకారంతో సవాల్ ఎదుర్కోవడానికి భారత్ సిద్దమయ్యిందని గుర్తు చేశారు. మన శాస్త్రవేత్తలు తమ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించి వ్యాక్సిన్ అభివృద్ధి చేశారని చెప్పారు.

విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేదని,  అయితే, రాజకీయ వర్గాలు , సంబంధిత వర్గాల నుంచి అందిన సంపూర్ణ సహకారంతో మన శాస్త్రవేత్తలు ఏడాది కాలంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేశారఅని డాక్టర్ మాండవీయ వివరించారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు, వ్యాధి నివారణ, చికిత్స అంశాలపై జంతువులపై పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెబుతూ  దీనికి సంబంధించిన అన్ని సౌకర్యాలు నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.

పరిశోధన సమయంలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ జంతువులకు అవసరమైన సంరక్షణను నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ అందిస్తుందని చెప్పారు.  అధునాతన సౌకర్యాలతో ఏర్పాటైన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ కేవలం జంతువులకు నైతిక సంరక్షణ కల్పించడం మాత్రమే కాకుండా పరిశోధన సమయంలో నియంత్రణ చర్యలు కూడా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

పరిశోధన సాగించే పరిశోధకులకు అవసరమైన సౌకర్యాలు అందించి వారి నైపుణ్య అభివృద్ధికి, కొత్తగా అభివృద్ధి చేసిన ఔషధాలు, వ్యాక్సిన్, వ్యాధి నిర్ధారణ అంశాలపై దేశంలో క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి, నూతన ఆవిష్కరణల నాణ్యత నిర్ధారించడానికి అవసరమైన సౌకర్యం అందిస్తుందని వివరించారు.

దేశంలో పటిష్టమైన పరిశోధన, ఆవిష్కరణ రంగం ఉండాలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని డాక్టర్ మాండవీయ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని చెప్పారు. యువత తమ మేధస్సును దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ భల్ మాట్లాడుతూ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యధిక ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటుందని తెలిపారు. నైతిక విలువలు పాటిస్తూ జంతువులపై పరిశోధనలు సాగించడానికి అవసరమైన సౌకర్యాలు సంస్థ కలిగి ఉంటుందని పేర్కొన్నారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు అరికట్టడానికి సంస్థ ఉపయోగపడుతుందని చెప్పారు.