అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌ను పునరాభివృద్ధి పథకం కింద అభివృద్ధి చేయడానికి ఇండియన్‌ రైల్వేస్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) ద్వారా చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి రోజు దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ స్టేషన్‌ రూపు రేఖలు త్వరలో మారనున్నాయి. 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చుట్టు ఉన్న 5.62 ఎకరాల విస్తీర్ణంతో పాటు 96,243 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తి కావడంతో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కాంట్రాక్ట్‌ పొందిన సంస్థతో పాటు రైల్వే శాఖకు చెందిన ఇంజినీరింగ్‌ విభాగాలు నిత్యంపనులను పర్యవేక్షిస్తున్నాయి. 

నగరంలోని వివిధ రకాలైన రవాణా వ్యవస్థలను రైల్వే స్టేషన్‌తో అనుసంధానం చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా గమ్యం చేర్చేందుకు ఆధునీకరణ పనులు చేపట్టినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫాంలను పూర్తిగా ఆధునీకరిం చనున్నారు. 26 అత్యాధునిక లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు.

స్టేషన్‌కు ఇరువైపులా 14,792 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్‌ 3 భవనాలను నిర్మించనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ మొత్తం పార్కింగ్‌కు కేటాయించడంతో పాటు స్టేషన్‌ ముందున్న విశాల ప్రాంగణంతో పాటు ఈ పార్కింగ్‌ స్థలం అందుబాటులోకి రానుంది. ప్లాట్‌ ఫాం ఉపరితలంపై ఏర్పాటు చేయనున్న సోలార్‌ పలకల ద్వారా విద్యుత్‌ ఉత్ప త్తి చేసి స్టేషన్‌ అవసరాల కోసం ఉపయోగించనున్నారు.

ఈ స్టేషన్‌ అభివృద్ధి పనులు మొత్తం పూర్తయితే ఏయిర్‌ పోర్ట్‌ను తలదన్నేలా ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. 2025 అక్టోబర్‌ నిర్ణిత గడువు లోగా పూర్తి చేసేందుకు అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి.