పాలసముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ

సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మించడానికి అన్ని అనుమతులు, అలాగే బడ్జెట్ కేటాయింపులు జరిపినట్లు భారత్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్, బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి తెలిపారు.
 మచిలీపట్నంలో శనివారం డాక్టర్ పార్థసారధి అధ్యక్షతన జరిగిన భారత ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల కమిటీ సమావేశంలో చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్  ఇతర డైరెక్టర్లు కూడా పాల్గొని పాలసముద్రంలో చేపట్టబోయే ఫ్యాక్టరీ మొదటి దశ నిర్మాణం కోసం రూ. 384 కోట్ల నిధులు మంజూరు చేశారు.
వాస్తవానికి 2016 లో రక్షణ అవసరాల కోసం మిజైల్స్ తయారీ , అలాగే రాడార్లు టెస్ట్ చేయడం కోసం పాలసముద్రం దగ్గర 914 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం సేకరించిందని ఆయన చెప్పారు. కానీ భూమి కన్వర్షన్, పర్యావణ అనుమతులు వంటి అనేక అంశాలు పరిష్కారమయ్యే సరికి 2020 దాటిందని, ఆపై కరోనా వల్ల మరింత ఆలస్యం అయిందని ఆయన తెలిపారు. 
ఈ భూమి ఏపీఐఐసీ కేటాయించడం వల్ల ప్రాజెక్టు సరైన సమయంలో మొదలవక పోవడంతో భూమిని  వెనక్కు ఇవ్వమని  ఏపీఐఐసీ కోరిందని, పైగా రూ 5 కోట్ల జరిమానా కూడా వేసినదని ఆయన వివరించారు.  ఇలాంటి అనేక సమస్యల మధ్య ఫ్యాక్టరీ నిర్మాణం మొదలవలేదని, అనుమతులు, బడ్జెట్ కేటాయించడం కూడా సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు.
2022లో కొన్ని నిబంధనలు మారిస్తే ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని, బడ్జెట్ ఇస్తామని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రతినిధులు, తాను ఏపీఐఐసీ   అధికారులను కలిసి చెప్పమని డా. పార్థసారథి పేర్కొన్నారు.  నిబంధనలను సవరించడం ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందని, ముందుగా అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో ఫ్యాక్టరీ నిర్మిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించడం సాధ్యమవుతుందని చెప్పమని ఆయన వెల్లడించారు. 
 
దీనితో పాటు చుట్టుపక్కలకు కూడా మరెన్నో ఫ్యాక్టరీలు అనుబంధంగా వచ్చే అవకాశం ఉందని, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇది ఒక ఆశా కిరణమవుతుందని, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని వివరించామని తెలిపారు. ఏపీఐఐసీ సానుకూలంగా స్పందించి కోరిన నిబంధనలు, ఆంక్షలు సడలించడంతోకేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అనుమతులతో పాటు, కంపెనీ ఫైల్స్ సిద్ధం చేసినదాని ఆయన చెప్పారు. 
కాగా, ముందుగా  అనుకున్నట్టుగా మిసైల్ తయారీ , రాడార్ టెస్టింగ్ తో పాటుగా మరిన్ని అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే  డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ గా దీన్ని అభివృద్ధి చేయాలని నేటి సమావేశంలో నిర్ణయించినట్లు డా. పార్థసారథి తెలిపారు. ఇక ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి పని మొదలు పెట్టాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతున్న పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
*