విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందని,  ఆనారోగ్యం పాలు చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. 

 బాసర ట్రీపుల్ ఐటీ విద్యార్థుల అగచాట్లు, ఆందోళనల తర్వాతైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తుందని భావించగా, అది తప్పని నిరూపించిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు నానా పాట్లు పడుతున్నరని ఆమె తెలిపారు. 

 నాసిరకం ఆహారం, అరకొర సదుపాయాలు, తీవ్ర చలికాలంలో చన్నీటి స్నానం తదితర పరిస్థితుల మధ్య కడుపు నొప్పి, వైరల్ ఫీవర్స్, వాంతులతో ఆనారోగ్యం బారిన పడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ మధ్యనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా విలవిలలాడిపోయారని ఆమె గుర్తు చేశారు. 

కొన్ని చోట్ల వంట, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, పాఠశాల సిబ్బంది సమ్మె కారణంగా టీచర్లు, విద్యార్థులే వంట చేసుకునే పరిస్థితి నెలకొందని ఆమె చెప్పారు. భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరిన కేసీఆర్ సంక్షేమ రాజ్యంలో ఇదీ విద్యార్థులు ఎదుర్కుంటున్న దుస్థితి’ అంటూ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు.