అధికారిక డేటా కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్

దేశ అధికారిక డేటా కన్నా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని స్విస్ బ్రోకరేజ్ ఫర్మ్ ‘క్రెడిట్ సూయిస్’ పేర్కొంది. ఈక్విటీల ఔట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది. భారతీయ ఈక్విటీలను ‘అండర్వ్రైట్’ నుంచి ‘బెంచ్‌మార్క్’కు అప్‌గ్రేడ్ చేస్తూ, బెంచ్‌మార్క్ సూచీలపై 14 శాతం వరకు వృద్ధికి అవకాశం ఉందని క్రెడిట్ సూయిస్ పేర్కొంది. 

ఆ బ్రోకరేజ్ ఫర్మ్ రిసెర్చ్ హెడ్ నీలకంఠ మిశ్రా భారత్ 2024 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి చెందనుందని పేర్కొన్నారు. అది కూడా వాస్తవ వృద్ధి 6 శాతం కంటే కిందికి పడిపోగలదన్న ఏకీభావ అంచనాలకు విరుద్ధంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఏకీభావ అంచనాలనేవి కేవలం అధికారి డేటా ఒక్కదానిపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. 

కాగా క్రెడిట్ సూయిస్ బ్రోకరేజ్ సంస్థ మాత్రం తన విశ్లేషణలో విస్తృత డేటాను పరిగణనలోకి తీసుకుంది. బిఎస్‌ఈ 500 కంపెనీల రెవెన్యూ వృద్ధి కూడా వేగంగా పెరుగుతోందని నీలకంఠ మిశ్రా తెలిపారు. 2023లో జిడిపి వృద్ధి వేగవంతం కాగలని పేర్కొన్నారు.

అనేక దేశీయ వృద్ధి డ్రైవర్లు, ప్రభుత్వ వ్యయంలో మార్పు, తక్కువ ఆదాయం ఉద్యోగాల పెరుగుదల, సప్లయ్-చైన్ సులభతరం, ప్రపంచ ఆర్థిక స్థితి నెమ్మదించడం, బ్యాలెన్స్ ఆఫ్ ఫేమెంట్స్‌ను తగ్గించుకోవడం వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ విషయం చెప్పారు. ఇదిలావుండగా ఆర్థిక రంగంలో హై క్రెడిట్ గ్రోత్ ఉంటుందని కూడా సూయిస్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ఐటి, ఇండస్ట్రియల్ రంగాలు అండర్‌వెయిట్‌గా ఉండగలవని మిశ్రా తెలిపారు.