సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని భారత్ గురువారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. గరిష్ఠంగా 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలగడం దీని ప్రత్యేకత.
ఈ క్షిపణి చైనా రాజధాని బీజింగ్ తో పాటు ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చేరుకోగలదు. త్వరలోనే ఈ క్షిపణిని భారత సైన్యానికి చెందిన వ్యూహాత్మక సైనిక కమాండ్ కు అప్పగించనున్నారు. మునుపటి కంటే అగ్ని–5 క్షిపణి బరువును తగ్గించామని భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
అవసరమైతే అగ్ని–5 క్షిపణి లక్ష్యాల పరిధిని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుందని ప్రయోగ పరీక్షల్లో తేలిందని వెల్లడించాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 క్షిపణిని ప్రయోగించి పరీక్షించినట్లు వెల్లడించాయి. కొత్త సాంకేతికతలు, పరికరాలను ధృవీకరించడానికి ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
మునుపటి కంటే మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ఈ క్షిపణి నిరూపించిందని పేర్కొన్నారు. వాస్తవానికి అగ్ ని–5 క్షిపణిని తొలిసారిగా 2012 సంవత్సరంలో పరీక్షించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దీన్ని మొత్తం తొమ్మిదిసార్లు టెస్ట్ చేయడం గమనార్హం.
కాగా, ఈ నెల 9న ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసుకోగా ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన వల్ల భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్ను చేరుకునే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని రోటీన్కు భిన్నంగా రాత్రి వేళ భారత్ పరీక్షించడం విశేషం.
More Stories
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు