రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు

సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ ఫౌండేషన్‌కు చైనీస్ ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు 2005-2007 మధ్య కాలంలో వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన మంగళవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్‌)కు 2005, 2006, 2007 సంవత్సరాల్లో చైనీస్ ఎంబసీ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు అందాయని అమిత్ షా తెలిపారు. 

భారతదేశం-చైనా సంబంధాలను పెంపొందించడానికి పరిశోధన చేయడానికి ఈ నిధులు తీసుకున్నారని చెబుతూ, అయితే  “చైనా-ఇండియన్ వార్” అని కూడా పిలువబడే 1962 యుద్ధంపై కఠినమైన సత్యాలకు సంబంధించిన అంశాలు అందులో  లేవని పేర్కొన్నారు. యుద్ధం సమయంలో భారత్ చైనాకు వేల కిలోమీటర్ల మేర భూమిని కోల్పోయిందని, అయితే తన పరిశోధనా అంశంలో ఈ ప్రశ్నను ఎప్పుడూ జోడించలేదని షా విమర్శించారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ఎఫ్‌సిఆర్‌ఎ ఉల్లంఘనపై లోక్‌సభలో ప్రశ్న తలెత్తకుండా ఉండేందుకు విపక్షాలు భారత్-చైనా ముఖాముఖి అంశాన్ని లేవనెత్తాయని  అమిత్ షా ఆరోపించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నల జాబితాను చూశానని, దానిలోని ఐదో ప్రశ్నను చూసేసరికి కాంగ్రెస్ ఆత్రుత దేనికో అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. 

ఆర్‌జీఎఫ్‌కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) ప్రకారం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడం గురించి ఐదో ప్రశ్న ఉందని చెబుతూ కాంగ్రెస్ సభ్యులు తనకు అవకాశం ఇచ్చి ఉంటే, తాను ఆర్జీఎఫ్‌కు వచ్చిన నిధుల గురించి వివరించి ఉండేవాడినని తెలిపారు.

హోం మంత్రిత్వ శాఖ నిబంధనలు ఉల్లంఘించడంతొ రాజీవ్  ఫౌండేషన్‌పై ఆంక్షలు విధించిందని, కాంగ్రెస్ తనను పార్లమెంటులో అనుమతించినట్లయితే,  ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెల్లడించేవాడినని తెలిపారు. 

“వారు అనుమతించినట్లయితే, 2005-2007 మధ్య కాలంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుండి రూ. 1.35 కోట్లు మంజూరు చేసిందని, ఇది ఎఫ్‌సిఆర్‌ఎ ప్రకారం సరికాదని పార్లమెంటులో నేను సమాధానం ఇచ్చేవాడిని.  నిబంధనల ప్రకారమే హోం మంత్రిత్వ శాఖ దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది,” అని అమిత్ షా తెలిపారు. 

సాంఘిక సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆర్‌జీఎఫ్‌ను రిజిస్టర్ చేయించారని, అందుకు విరుద్ధంగా భారత్-చైనా సంబంధాలపై పరిశోధన కోసం నిధులను వినియోగించారని ఆయన వెల్లడించారు. చైనా అంటే మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా ప్రేమ అని, అందుకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వాన్ని ఆయన వదులుకున్నారని అమిత్ షా ఆరోపించారు. వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నుంచి రూ.50 లక్షలను ఆర్‌జీఎఫ్‌ 2011 జూలై 7న స్వీకరించిందని ఆయన పేర్కొన్నారు. 

మోదీ పాలనలో ఒక్క ఇంచు భూమి కూడా పోదు

 కాగా, బీజేపీ పాలనలో భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా కబ్జా కాలేదని అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ ఒక్కరూ భారత్ లో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని తేల్చి చెప్పారు.  చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. 
 
అతి తక్కువ సమయంలోనే చైనా దళాలకు దీటుగా జవాబు చెప్పారని అంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత దేశ భూభాగాన్ని కనీసం ఒక అంగుళం మేరకు అయినా ఎవరూ కబ్జా చేయలేరని భరోసా వ్యక్తం చేశారు.  ‘‘నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మన భూమిలోని ఓ అంగుళం మేరకు అయినా ఎవరూ కబ్జా చేయలేరు’’ అని అమిత్ షా చెప్పారు.