తెలుగులో పరమహంస యోగానంద సాధనా పాఠాలు 

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 1917లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల (వైఎస్ఎస్ క్రియా యోగ పాఠములు) తెలుగు అనువాదాన్ని తెలుగులో అందిస్తున్నారు. యోగదా సత్సంగ సొసైటీ (వైఎస్ఎస్) ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు స్మామి స్మరణానంద,  బ్రహ్మచారి కేదారానంద్ జీ వాటిని శనివారం విడుదల చేశారు. 
డిసెంబర్ 10, 11 తేదీల్లో బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేంద్రంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకూ ఈ కార్యక్రమంతో పాటుగా స్వామి స్మరణానంద ప్రసంగాలు ఏర్పాటయ్యాయి. 1946 డిసెంబరులో విడుదలైనప్పటి నుంచి నిరంతరంగా అత్యధికంగా అమ్ముడవుతున్న తన మైలురాయి రచన ఒక యోగి ఆత్మకథతో జగద్గురువు పరమహంస యోగానంద లక్షలాది మందికి యోగా, ధ్యానాన్ని పరిచయం చేశారు.
ఈ పుస్తకం ఒక అసాధారణమైన జీవితం గురించి మనోహరంగా వ్రాసినది. ప్రాచీన యోగ విజ్ఞాన శాస్త్రం గురించి అలాగే ధ్యానానికి సంబంధించి చాలా కాలం నుంచి గౌరవింపబడుచున్న సాంప్రదాయానికి లోతైన పరిచయం కూడా. ఈ ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆధ్యాత్మిక అన్వేషకులను వారి జీవితాల్లో సమతుల్యమైన, దైవాన్నే కేంద్రంగా చేసుకుని జీవించే విధానాన్ని అవలంబించడానికి ప్రేరేపించింది.
 
యోగానంద అద్భుతమైన జ్ఞానం ఆయన అనేక రచనలు, ప్రచురణలలో వ్యక్తీకరించబడింది. ఆయన బోధనలలో అంతర్గతంగా క్రియాయోగ పవిత్ర శాస్త్రం, రాజయోగం యొక్క స్వరూపము ఉంది. ఇది శరీరం, మనస్సు రెండింటినీ నిశ్చలం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియ సంవేదనల సాధారణ కల్లోలం నుంచి ఒకరి శక్తిని, ధ్యాసను ఉపసంహరించుకోవడం సాధ్యపడుతుంది. 
 
ఆ అంతర్గత నిశ్చలతలో, భక్తులు గాఢమౌతున్న అంతర్గత శాంతిని అనుభవిస్తారు. వారి స్వీయ ఆత్మతో సామరస్యం పొందుతారు. యోగా, ధ్యానం ఈ ప్రాచీన, ఆత్మను జాగృతం చేసే ప్రక్రియ అంధయుగాలలో శతాబ్దాలుగా కనుమరుగు అయిపోయింది. కేవలం తపస్వులకు మాత్రమే బోధించబడింది. 
 
కానీ 1861 శరదృతువులో హిమాలయ పర్వతాలలోని ఒక మారుమూల గుహలో, గొప్ప యోగి-గృహస్థుడైన లాహిరీ మహాశయులు తన గురువు మహావతార్ బాబాజీని మొదటి సారిగా కలుసుకున్నారు, ఆయన నుంచి క్రియాయోగాన్ని స్వీకరించారు. ఈ మొదటి సమాగమంలో (ఇది యోగానంద ఆధ్యాత్మిక మహాగ్రంథం ఒక యోగి ఆత్మకథ పేజీలలో చిరస్థాయిగా నిలిచిపోయింది). 
 
మహావతార్ బాబాజీ…. లాహిరీ మహాశయులను క్రియను మొదటిసారిగా, ఆసక్తిగల సత్యాన్వేషకులందరికీ బోధించమని నిర్దేశించారు. తరువాత బాబాజీ, లాహిరీ మహాశయుల శిష్యులైన స్వామి శ్రీ యుక్తేశ్వర్‌ను యోగానందకు శిక్షణ ఇవ్వాలని, ఈ ఆత్మసాక్షాత్కార ప్రక్రియను ప్రపంచానికి అందించడానికి యోగానందను పశ్చిమ దేశాలకు పంపమని కోరారు.
 
వై.ఎస్.ఎస్. పాఠాల ద్వారా జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను తీసుకురావడానికి ధ్యానం ద్వారా పవిత్రమైన క్రియాయోగ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి యోగదా సత్సంగ పాఠాల కోసం దరఖాస్తు చేసుకోవడం మొదటి దశ.
 
ఈ పాఠాల ద్వారా మొదటి సంవత్సరంలో, విద్యార్థులు ధ్యానానికి సంబంధించి మూడు ప్రాథమిక ప్రక్రియలను, పరమహంస యోగానంద సమతుల్య ఆధ్యాత్మిక జీవనం సూత్రాలను నేర్చుకుంటారు.  వై.ఎస్.ఎస్. పాఠాలు ఒక వ్యక్తి జీవితంలోని అన్ని పార్శ్వాలనూ ఉద్ధరించే, పరివర్తన చేసే శక్తిని కలిగి ఉన్న పవిత్రమైన జ్ఞాన ప్రసారాన్ని ఏర్పరుస్తాయి. 
 
ఇవి ప్రఖ్యాత యోగ గురువులు మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్, పరమహంస యోగానంద వంటి ప్రఖ్యాత గురు పరంపర ద్వారా అందించబడిన ధ్యాన పద్ధతులు. సనాతన ధర్మం సారాంశాన్ని బోధించే ప్రగతిశీల, గృహ-అధ్యయన కార్యక్రమం. ఇది ఇప్పుడు ప్రతి సత్యాన్వేషికీ అందుబాటులో ఉంది. 
 
ప్రక్రియలతో పాటుగా, ఈ పాఠాలు ఆధ్యాత్మిక జీవనం కోసం అమూల్యమైన స్ఫూర్తిని, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని (ఈ మారుతున్న ప్రపంచంలోని ఎడతెగని సవాళ్లు మరియు అవకాశాల మధ్య ఆనందంగా, విజయవంతంగా జీవించడం ఎలాగో తెలుసుకోవడం కోసం) అందిస్తాయి. ఈ పాఠాలు విద్యార్థికి ఆ స్ఫూర్తిని రోజువారీ ఆధ్యాత్మిక సాధనగా పరివర్తన చేసుకోవడాన్ని బోధిస్తాయి.
 
వైఎస్ఎస్. పాఠాలలో కొన్ని అంశాలు:  సంతులిత ఆధ్యాత్మిక-జీవన కళ; యోగం: భగవంతుణ్ణి తెలుసుకొనే సార్వత్రిక శాస్త్రం; ఆరోగ్యానికి, స్వస్థపరచడానికి సంబంధించిన యోగ సూత్రాలు; వెన్నెముకలో చక్రాలను జాగృతి చెయ్యడం; ప్రార్థన ద్వారా భగవంతునితో అనుసంధానం; జీవితం-మరణం-కర్మ, పునర్జన్మ.
 
మరింత సమాచారం కోసం: yssi.org/Lessons*06516655555, నెంబర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం పొందవచ్చు.