గిరిజన మహిళలకు వారసత్వ హక్కు

వీలునామా లేని ఆస్తికి వారసత్వం/పారంపర్యం హక్కులను గిరిజన పురుషులతో సమానంగా పొందేందుకు గిరిజన మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు చెప్పింది. గిరిజనుడు కానటువంటి తండ్రి యొక్క కుమార్తె తన తండ్రి ఆస్తిలో సమాన వాటా పొందేందుకు అర్హురాలు అయినపుడు, గిరిజన తండ్రికి జన్మించిన కుమార్తెకు ఆ హక్కును నిరాకరించడంలో హేతుబద్ధత లేదని తెలిపింది.
షెడ్యూల్డు తెగల మహిళలకు ఈ హక్కులను వర్తింపజేసే విధంగా చట్టాన్ని సవరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 2(2) ప్రకారం షెడ్యూల్డు తెగలకు ఈ చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం స్పందిస్తూ, తండ్రి మరణానంతరం ఆస్తికి వారసురాలయ్యే హక్కును గిరిజన మహిళకు తిరస్కరించడం సరికాదని తెలిపింది.
ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలు గిరిజన మహిళలకు వర్తించకపోవడాన్ని పరిశీలించి, అవసరమైతే తగిన సవరణలు చేయడం గురించి ఆలోచించాలని తెలిపింది.
 భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 21 ప్రకారం భారతీయులకు హామీగా లభించిన సమానత్వ హక్కులను పరిగణనలోకి తీసుకుని, కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయిందని, ఆ తర్వాత అనేక మార్పులు జరిగాయని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా గిరిజన మహిళకు సమానత్వాన్ని నిరాకరించడం సరికాదని పేర్కొంది.