మెట్రో రెండో దశలో భాగంగా అంటూ రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపడుతున్న పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం భూమి పూజ జరుపుతున్నారు. రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ను నిర్మిస్తారని చెబుతున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుందని అంటున్నారు.
అయితే, మెట్రో ఫేజ్ –1లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ఓల్డ్ సిటీ మీదుగా 5.2 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన మెట్రో లైన్ పనులు ఇంత వరకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టడం లేదు. మెట్రోను ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలనే డిమాండ్ చాలా కాలం నుంచే ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం–ఎయిర్పోర్ట్ రూట్ 31 కిలోమీటర్లు ఉన్నది.
మరో రెండు రూట్లలోనూ ఎయిర్పోర్ట్కు మెట్రో విస్తరించే ప్లాన్లు గతంలోనే సిద్ధం చేశారు. అందులో ఫలక్నుమా నుంచి ఎయిర్ పోర్ట్ అనే ప్రతిపాదనకు సర్వే పూర్తి చేశారు. ఫలక్నుమా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు దూరం 16.6 కిలోమీటర్లు వస్తుంది. అంటే.. 14.4 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టాల్సిన 15 కి.మీ.పనుల్లో ఎంజీబీఎస్ వరకు పూర్తయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి గతేడాది, ఈసారి కలిపి బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించినా రూపాయీ విడుదల చేయలేదు. ఇది పూర్తి చేసి.. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో చేపడితే ఖర్చు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్కు ప్రాజెక్ట్ చేపడితే ఆ దూరం 23 కిలో మీటర్ల ఉంటుంది. రాయదుర్గంతో చూస్తే ఇది 8 కిలో మీటర్లు తక్కువ. నిర్మాణ ఖర్చు కూడా తక్కువే. పైగా రాయదుర్గం నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వరకు ఏడాదికి లక్ష మంది వరకే ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నెలకు దాదాపు 8,500 మంది, అంటే రోజుకు దాదాపు 300 మంది మాత్రమే కొత్త రూట్లో ప్రయాణిస్తారు.
ప్రస్తుత మార్గం అధిక వ్యయం కావడమే కాకుండా, నిర్వహణ వెసులుబాటు సహితం అంతంత మాత్రం అని స్పష్టం అవుతున్నా కేవలం తమ అనుయాయులు, లీడర్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఈ మార్పును ప్రభుత్వం చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ కొత్త రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,250 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అదే ఫలక్నుమా నుంచి చేపడితే రూ. 4వేల కోట్ల వరకు అవుతుంది. అంటే దాదాపు రెండు వేల కోట్ల భారం తగ్గుతుంది. అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ చేసినా ఖర్చు తగ్గుతుంది.
కానీ.. ప్రభుత్వం రాయదుర్గం రూట్నే ఎంచుకోవడం, కేంద్రంతో పనిలేకుండా తామే చేపడ్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త రూట్ పొడవునా టీఆర్ఎస్ నేతలు, సన్నిహితుల భూములు ఉన్నాయి.
పైగా మొన్నటి వరకు 111 జీవో పరిధిలో ఈ భూములు ఉండేవి. ఇప్పుడు జీవోలోని ఆంక్షలను కూడా ఎత్తేసింది. ఫలితంగా అక్కడ భూములకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు మెట్రో వల్ల ఆ ఏరియాలో భూముల ధరలు పదింతలు కానున్నాయి. భూముల ధరలను అమాంతం పెంచుకుని రియల్ బూమ్తో సొమ్ము చేసుకోవాలనే ప్లాన్లో భాగంగానే కొత్త మెట్రో రూట్ ఆగమేఘాల మీద పట్టాలు ఎక్కుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాయదుర్గంలో ఎస్ఎఫ్టీ మొన్నటి దాకా రూ.10 వేలు ఉంటే ఇప్పుడు రూ.14 వేలకు ఎగబాకింది. నానక్రాంగూడలో ఏరియాను బట్టి ఎకరం రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లు ఉంటే ఇప్పుడు ఇది రూ.100 కోట్లు దాటుతున్నది. రాజేంద్రనగర్ రోడ్డు, టీఎస్పీఏ జంక్షన్ ఏరియాలో మినిమమ్ ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఉంటే.. ఈ నెల కాలంలోనే 60 కోట్లు దాటింది.
మెట్రో ప్రాజెక్ట్ పూర్తయితే ఈ రేట్లు మరింతగా పెరుగుతాయి. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు చేపట్టనున్న మెట్రో కారిడార్లో ఎయిర్పోర్ట్ సమీపంలో 2.5 కి. మీ. అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ కారిడర్లో మైండ్ స్పేస్ (రాయదుర్గం), బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ నానక్ రాంగూడ, నార్సింగి, టీఎస్పీఏ, హిమాయత్ సాగర్ , రాజేంద్రనగర్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు కార్గో, టెర్మినల్ స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
రూట్లో భూములన్నీ 111 జీవో పరిధిలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతాల్లోని ఎక్కువ మొత్తంలో భూములు కొనుగోలు చేసింది కూడా అధికార పార్టీలోని వాళ్లేననే విమర్శలు ఉన్నాయి. అందువల్లే జీవో 111లో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం 69 జీవో ఇచ్చింది. దీనిపై స్పష్టత రాకముందు కొత్త రూట్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వ పెద్దలకు చెందిన వేల ఎకరాల భూములకు లబ్ధి చేసేలా ప్లాన్ను అమలు చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
More Stories
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే
మోదీ – మమతా మధ్య పోరుగా మారిన బెంగాల్ ఎన్నికలు
హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా నకిలీ ఓట్ల తొలగింపు