ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అన్ని సంస్థలకు అవకాశం

ఈఎస్ఐ ఆస్పత్రి భవనాల నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్’తో పాటు ఇతర నిర్మాణ సంస్థలు కూడా పాల్గొనేలా వెసులుబాటు కల్పిస్తూ వేగవంతంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. 
 
 రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రసంగించారు. విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ఈఎస్ఐ ఆస్పత్రుల స్థితిగతుల గురించి జీవీఎల్ ప్రశ్నించారు.
కొత్తగా మంజూరైన 7 ఆస్పత్రుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి కారణాలేంటో తెలపాలని కోరారు. ఈ ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిస్తూ  ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు మంత్రిత్వ శాఖ ఇటీవల కొన్ని మార్పులు చేసిందని, సీపీడబ్ల్యుడీతో పాటు నిర్మాణాలు చేపట్టే అన్ని ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు భవిష్యత్ నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొంటాయని తెలిపారు.
ఆ రకంగా రాష్ట్రంలో మిగతా హాస్పిటళ్ళను తొందరగా పూర్తి చేయగలమని, నిర్మాణంలో ఉన్న 76 ఆసుపత్రులను అనుక్షణం సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ తయారు చేశామని మంత్రి తెలియచేశారు.