ఉక్రెయిన్కు స్ఫూర్తిగా నిలిచిన ఆ దేశాధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్స్కీని 2022 సంవత్సరపు మేటి వ్యక్తిగా టైమ్ మేగజైన్ ప్రకటించింది. రష్యా ఆక్రమణ పట్ల ప్రదర్శిస్తున్న తీవ్రస్థాయి ప్రతిఘటనకు గుర్తింపుగా జెలెన్స్కీని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంచుకున్నట్లు పత్రిక తెలిపింది.దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ జెలెన్స్కీని హీరోగా కొనియాడుతున్నారని, రష్యా సైనిక చర్యకు వెరువకుండా ఆయన దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొన్నది.
తాలిబన్లు అఫ్గాన్ను హస్తగతం చేసుకున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారని, అలాగే 2014లో నిరసనకారులు తన ఇంటిని చుట్టుముట్టేందుకు వస్తున్న సమయంలో నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టోర్ యనుకోవిచ్ కూడా కీవ్ను వీడారని గుర్తుచేసింది. అయితే జెలెన్స్కీ రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలిచారని కొనియాడింది.
ప్రస్తుత యుద్ధ తీవ్రస్థాయి పరిణామాల దశలోనూ ప్రెసిడెంట్గా దేశ బాధ్యతలు తీసుకుని, ఆయన రాజధాని కీవ్లోనే ఉండాలని నిర్ణయించుకుని, సైన్యానికి ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పిస్తూ స్ఫూర్తిని అందించినందుకు ఈ గుర్తింపు ప్రకటించినట్లు టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెన్తల్ తెలిపారు. తన అనుభవంలో ఇది అత్యంత చిరస్మరణీయ ఘట్టంగా ఉంటుందని చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దాడి ఆరంభించినప్పటి నుంచి జెలెన్స్కీ ప్రజలకు ధైర్యం కల్పిస్తూ ప్రసంగించడం, వీటిపై ఉక్రెయిన్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పౌరులు దృష్టి సారించడం వంటి పరిణామాలను టైమ్స్ ఉదాహరించింది. తరచూ యుద్ధ క్షేత్రాలకు వెళ్లడం, సైన్యంతో కలిసి గడపడం, ఇటీవల అత్యంత కీలకమైన దక్షిణ ప్రాంతపు నగరం ఖేర్సాన్ నుంచి రష్యా సేనలు వైదొలిగిన క్రమంలో అక్కడి వీధులలో జనంతో కలిసి ఉత్సవాలు నిర్వహించడం వంటి పరిణామాలను కీలక అంశాలుగా ఈ మేగజైన్ పరిగణనలోకి తీసుకుంది. ఆయన అనుసరించిన సమాచార ప్రక్రియతో భౌగోళిక రాజకీయ ప్రక్రియలో తీవ్రస్థాయిలో మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కార్యాచరణకు రంగం సిద్ధం అయిందని ఎడిటర్ ఇన్ చీఫ్ విజేతను ప్రకటిస్తూ పేర్కొన్నారు.
More Stories
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు