సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదు

సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణ చేసే ఆలోచనేదీ లేదని, ఒకవేళ చేయాలనుకున్నా సాధ్యం కాదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సింగరేణిని  ప్రైవేటీకరించడం లేదని, అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే కోల్ బ్లాక్స్ కేటాయింపు వేలం ద్వారా కొనసాగుతోందని తెలిపారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు జీరో అవర్లో కాంగ్రెస్ ఎంపీ (నల్గొండ) ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తారు.

అదే సమయంలో తెలంగాణలోని 4 బొగ్గు గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లుగా లాభాల్లో ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను ప్రైవేటీకరణ చేయవద్దని ఆయన కోరారు. బొగ్గు గనులు తమకు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే కేంద్రం ప్రైవేటుపరం చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఈ అంశంపై కేంద్ర  మంత్రి ప్రహ్లాద్ జోషి వెంటనే స్పందిస్తూ  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చి చెప్పారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉన్నప్పుడు 49% వాటా కల్గిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

పూర్తి పారదర్శకంగా వేలం ప్రక్రియ ద్వారా జరుగుతున్న బొగ్గు గనుల కేటాయింపుపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కల్గిన రాష్ట్రాలకు మరిన్ని ప్రయోజనాలు కల్గుతున్నాయని, అందుకే అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు సైతం వేలం పద్ధతిని స్వాగతించి అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అక్కడి ప్రభుత్వాలు సహకరిస్తుండగా తెలంగాణలో వచ్చిన సమస్య ఏంటో చెప్పాలి’ అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.  వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుందని చెబుతూ రెండున్నర ఏండ్లుగా చాలా పారదర్శకంగా ఈ పద్ధతి కొనసాగుతోందని గుర్తు చేశారు.

ఇప్పటివరకు దీనిపై ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పలేదని,  ఈ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా ఉందని స్పష్టం చేశారు. కోల్ బ్లాక్స్ వేలంలో రాష్ట్రాలు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శకంగా సాగుతున్న వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి చురకలు వేశారు.