జి20 అధ్యక్షత ఓ అపురూప అవకాశం

జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడం దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటడానికి లభించిన అపురూప అవకాశంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.జీ20 అధ్యక్ష బాధ్యతలను నిర్వహించే అవకాశం రావడం భారతదేశానికి గర్వకారణమన్నా ప్రధాని మోదీ ఈ సదస్సును విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు. 
 
ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం సాయన్తరం జరిగిన అఖిలపక్ష సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని ఉన్న 40కు పైగా రాజకీయ పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొని విలువైన సలహాలు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 
 
భారతదేశ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుకు సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాల గురించి ప్రధాని ఈ భేటీలో వివరించారు. ఆయా కార్యక్రమాల నిర్వహణలో అన్ని పార్టీల నేతల సహకారం కావాలని కోరారు. జీ 20 సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలి అన్నదానిపై విలువైన సలహాలు కూడా ఇచ్చారు.
 
దాదాపు ఏడాదిపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విదేశీయులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేశంలో పర్యాటక, స్థానిక ఆర్థికవ్యవస్థల వృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రదాని సూచించారు.
ఇక, దేశానికి ఈ అవకాశం రావడం గర్వకారణంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. అయితే, దీన్ని దేశ ప్రయోజనాల కోసం, సరిహద్దుల్లో చైనా దాడులను నివారించడానికి, ఆ దేశంతో ఉన్న వాణిజ్యపరమైన అసమతౌల్యాలను సరిచేసుకోవడానికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
 
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం సంపాదించడానికి, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై చర్యకు ఇతరదేశాల మద్దతును కూడగట్టడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. 
 
దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైనవారిని తిరిగి రప్పించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఖర్గే మోదీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.   జీ-20 అధ్యక్షత ఒక పార్టీ ఎజెండా కాదని.. ఇది దేశం మొత్తానికీ సంబంధించిన అంశమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో తెలిపారు.
శాంతి, సామరస్యాలు, అహింస, సమన్యాయాల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రధాని ఈ సదస్సును ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారన్న విశ్వాసాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యక్తం చేశారు. కేంద్రానికి తమ పూర్తి సహాయసహకారాలు, మద్దతు ఉంటాయని స్పష్టం చేశారు.
 
ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సదస్సు విజయవంతానికి రాష్ట్రం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు.
 
ఈ సమావేశం లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్నిప్రధాని తన ప్రసంగం లో ప్రస్తావించారు. భారతదేశ భవిష్యత్ ప్రయాణం పై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం లో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2 దేశంగా అవతరిస్తుంది అనీ, యువ శక్తి మన దేశానికి ఉన్న బలం అని చెప్పారు.
యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాల పాలసీల రూపకల్పన జరగాలి అనీ, దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయిని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. కాగా  ఈ సమావేశానికితెలంగాణ  సీఎం కేసీఆర్‌, జేడీయూ చీఫ్‌ లలన్‌ సింగ్‌ హాజరు కాలేదు. ఆర్జేడీ ప్రతినిధులు కూడా సమావేశానికి రాలేదు. టిఆర్‌ఎస్‌, ఎన్‌సిపి, ఎస్‌పి, బిఎస్‌పి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌జెడి, జెడియు, శివసేన (ఠాక్రే), ఆర్‌ఎస్‌పి, ఎంఐఎం, అపాుదల్‌, ఎస్‌ఎడి, ఎఐయుడిఎఫ్‌, జెఎంఎం తదితర పార్టీలు గైర్హాజరు అయ్యాయి.
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆప్‌), మమతా బెనర్జీ (టిఎంసి), నవీన్‌ పటాుయక్‌ (బిజెడి), ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ (ఎస్‌కెఎం), ఏక్‌నాథ్‌ షిండే (శివసేన-షిండే), జోరంతంగా (ఎంఎన్‌ఎఫ్‌), పలనిస్వామి (అనాుడిఎంకె), కె.ఎం. కాదర్‌ మొహిదీన్‌ (ఐయుఎంఎల్‌), పసుపతి కుమార్‌ పారస్‌ (ఆర్‌ఎల్‌జెపి), రాందాస్‌ అథ్వాలే (ఆర్‌పిఐ), హనుమాన్‌ బెనివాల్‌ (ఆర్‌ఎల్‌పి), కెఎం మణి (కెసి), తిరుమవలన్‌ (విసికె), హౌం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాల్గొన్నారు.