బెంగాల్‌ టీఎంసీ నేతను అరెస్ట్‌ చేసిన గుజరాత్‌ పోలీసులు

తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సాకేత్‌ గోఖలనే గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
సోమవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి జైపూర్‌కు బయలుదేరాడని, జైపూర్‌కు చేరుకోగానే గోఖలనే అరెస్టు చేశారని తెలిపారు. అరెస్టు తర్వాత మంగళవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో గోలఖలో తన తల్లికి ఫోన్‌ చేసి గుజరాత్‌ పోలీసులు తనను అహ్మదాబాద్‌కు తీసుకువెళ్తన్నారని చెప్పాడని పేర్కొన్నారు.
కేవలం రెండు నిమిషాలు మాత్రమే పోలీసులు తల్లితో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చి ఆ తర్వాత ఫోన్‌, వస్తువులను స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఇటీవల మోర్బీ సమీపంలో వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సంఘటనా స్థలాన్ని మోదీ పరిశీలించారు.
అయితే, మోర్బీలో ప్రధాన పర్యటన కొద్ది గంటలకే రూ.30కోట్ల ఖర్చయ్యిందని ఆరోపించారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫొటోగ్రఫీకే రూ.5.5కోట్లు ఖర్చు చేశారని, 135 మంది ప్రాణాల కంటే ఎక్కువ ఖర్చయ్యిందని విమర్శించారు. ఘటనలో చనిపోయిన 135 మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు.
టీఎంసీ నేత చేసిన ట్వీట్‌పై గుజరాత్‌ బీజేపీ మండిపడింది. గోఖలే ట్వీట్‌లో ఇచ్చిన సమాచారం ఫేక్‌ అని, ఆర్టీఐ కింద అలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. అక్టోబర్‌లో మోర్బీ వంతెనపై తీగల వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 55 మంది పిల్లలు సహా మొత్తం 135 మంది ప్రాణాలు కోల్పోయారు.