గుజరాత్ లో మరోసారి మోదీ హవా -పీపుల్స్‌పల్స్‌

గుజరాత్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే మోదీ హవా నడిచిన్నట్లు  పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం గుజరాత్ లో బీజేపీకి 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
 
ఇన్ని సీట్లు రావడానికి మోదీ హవానే కారణం అని పేర్కొంటూ తమ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బిజెపి-కాంగ్రెస్‌ మధ్య ఓట్ల వ్యత్యాసం 21 శాతంగా ఉందని తెలిపింది. బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 25 శాతం, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 16 శాతం, ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వివరించింది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతం.
182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 92 సీట్లు గెలవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం అయినందున, ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్ బీజేపీకి లాభం చేకూర్చిందని పీపుల్స్‌ పల్స్‌ తెలిపింది.
 ఈ సారి గుజరాత్ లో దాదాపు 30 బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ పాల్గొనడం, వరసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించడం వల్ల గుజరాత్ లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగిందని పీపుల్స్‌పల్స్‌  వివరించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ 16 శాతం ఓట్లు సాధించినా, సీట్లు సాధించడంలో విఫలమయ్యిందని పేర్కొన్నది.  అయితే,గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు సాధించిన ఓట్ల శాతం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా వచ్చే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నది.  2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ 3.1 శాతం తగ్గింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 16.4 శాతం తగ్గిందని ఈ సర్వే తెలుపుతుంది. 
 2017 రాహుల్ గాంధీ లాగా, ఈ సారి జాతీయ నాయకులు ఎవరూ గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టకపోవడమే కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గడానికి కారణమని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది. దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీకి మేలు చేకూరిందని భావిస్తున్నది.
మైనార్టీలు తప్ప దాదాపు అన్ని సామాజిక వర్గాలు బీజేపీ వైపే నిలబడినట్లు స్పష్టం అవుతుంది.  హర్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్…వంటి వారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ప్లస్ అయ్యిందని పీపుల్స్‌పల్స్‌ భావిస్తున్నది. నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం, పంటలకు కనీస మద్దతు ధర, అభివృద్ధి, అవినీతి వంటివి గుజరాత్ లో ప్రధానమైన సమస్యలని పీపుల్స్‌పల్స్‌ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
 
రైతులు, సామాన్యులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నా… వారికి వేరే ప్రత్యామ్నాయ పార్టీ కనిపించకపోవడంతో మళ్లీ బీజేపీకే పట్టం కట్టారని అంచనా వేస్తున్నది.  స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టినందుకే కాంగ్రెస్ కి ఈ మాత్రం సీట్లు వస్తున్నాయని తెలిపింది.  ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ కు 24 శాతం మంది, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 20 శాతం, హర్థిక్ పటేల్ కు 14 శాతం మంది, ఈ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పీపుల్స్‌పల్స్‌ తెలిపింది. 
 
గుజరాత్ లో పీపుల్స్‌పల్స్‌ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 240 పోలింగ్‌ స్టేషన్లలో నిర్వహించి, మొత్తం 4800 శాంపిల్స్‌ను సేకరించింది.