హిందువుల వివాహం వాఖ్యలపై ఎంపీ అజ్మల్ క్షమాపణ

హిందువులు ఆలస్యంగా వివాహాలు చేసుకొంటున్నారని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ క్షమాపణలు చెప్పారు. తన వాఖ్యలపై పలు వర్గాల నుండి విమర్శలు చెలరేగడంతో ఉద్దేశపూర్వకంగా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.

”ఏ మతం వారి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. ఒక సీనియర్ నేతగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. నా వ్యాఖ్యలు ఎవరిని బాధించినా వారికి క్షమాపణలు చెబుతున్నాను. చాలా సిగ్గుపడుతున్నాను. మైనారిటీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, విద్య, ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను” అని అజ్మల్ తెలిపారు. 

తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా చెప్పారు. హిందూ అనే పదం తాను వాడలేదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే, తన వ్యాఖ్యలు వివాదం కావడంతో తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని చెప్పారు. ఇందుకు సిగ్గుపడుతున్నట్టు తెలిపారు.

బద్రుద్దీన్ అజ్మల్ గత శుక్రవారంనాడు హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అదే ముస్లిం యువకులు 21 ఏళ్ల నిండిన వెంటనే పెళ్లిళ్లు చేసుకుంటారని, హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని 40 ఏళ్ల వరకూ అవివాహితులుగానే ఉంటారని చెప్పారు.

 ”ఇంత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు? హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణం. సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితే మంచి ఫలితాలు వస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల విషయంలో ముస్లింలు అనుసరించిన విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలని సూచించారు. హిందూ బాలికలు 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే మంచి సంఖ్యలో పిల్లలు పుడతారని చెప్పారు.