ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు

ప్రజాస్వామ్యంపై ఏం చేయాలనే విషయంలో ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో తాము లేమని, తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది. 
 
ఐక్యరాజ్యసమితి విభాగాల్లో అత్యంత బలమైన భద్రతా మండలికి ఈ నెలలో భారత్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. 15 సభ్య దేశాలున్న భద్రతామండలికి ఈ నెల ఎలెక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాలో అధ్యక్ష విధులను భారత్ చేపట్టింది. ఈ నెలలో అధ్యక్ష పదవి చేపట్టడంతో పాటు భద్రతా మండలి ఎన్నికను సభ్యునిగా భారత్ రెండేళ్ల పదవి కాలం కూడా ముగియనున్నది. 
 
అధ్యక్ష స్థానంలో భారత మహిళా ప్రతినిధి రుచిరా కాంబోజ్ కూర్చున్నారు. ఐక్యరాజ్యసమితికి ఎంపికైన తొలి మహిళా శాశ్వత ప్రతినిధి రుచిరా కావడం గమనార్హం. ఈ సందర్భంగా భారత్ లో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె ఘాటుగా బదులిచ్చారు.
ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత భారత్ దే అనే విషయం మీ అందరికీ తెలిసిందేనని ఆమె గుర్తు చేశారు. 2,500 ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు ఉన్నాయని ఆమె తెలిపారు.
ఎప్పటికీ భారత్ అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమని స్పష్టం చేస్తూ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థతో పాటు ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రెస్ అనే నాలుగు పిల్లర్లపై తమ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందని ఆమె తెలిపారు. భారత్ లో సోషల్ మీడియా కూడా అత్యంత చురుకుగా ఉందని ఆమె చెప్పారు. అందుకే ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉందని ఆమె వివరించారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రటిక్ ఎక్సర్ సైజ్ (ఎన్నికలు) ను తాము నిర్వహిస్తామని ఆమె గుర్తు చేశారు. ప్రజలకు వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే స్వేచ్ఛ ఉంటుందని, తమ దేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా కొనసాగుతోందని  ఆమె చెప్పారు. ప్రపంచంలో ఎంతో మంది ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని ఆమె తెలిపారు.