జి20 అధ్యక్ష స్థానంలో ప్రపంచం ముందుకు భారతీయ అనుభవాలు

నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి 
జి20 కి ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించిన 17 సభ్యత్వ దేశాలు సార్థకమైన ఫలితాలను అందించాయి. ఆ ఫలితాలలో స్థూల ఆర్థిక స్థిరత్వానికి పూచీ పడడం, అంతర్జాతీయ పన్నుల విధానాన్ని సక్రమంగా వ్యవస్థీకరించడం, దేశాలకు రుణ భారాన్ని తగ్గించడం వంటి ఫలితాలు సహా మరెన్నో మహత్వపూర్ణమైనటువంటి పరిణామాలు కూడా భాగం అయ్యాయి.
ఈ కార్యసాధనల తాలూకు లాభాలను మనం అందుకొన్నాం; అంతేకాదు, ఇక్కడి నుండి మరింత ముందుకు కూడా మనం సాగిపోతాం. ఏమైనా, భారతదేశం తనకు అప్పగించినటుంటి ఈ ముఖ్యమైన పదవిని స్వీకరిస్తున్న తరుణంలో, నన్ను నేను ఒక ప్రశ్న వేసుకొంటున్నాను. ఆ ప్రశ్న ఏమిటి అంటే అది జి20 ఇంకా ముందుకు పోగలుగుతుందా? అనేదే.
యావత్తు మానవాళికి ప్రయోజనం అందేటట్టుగా, మనస్తత్వంలో మౌలికంగా పరివర్తనను తీసుకు వచ్చే ఒక ఉత్ప్రేరకం వలె మనం పనిచేయగలుగుతామా? మనం దీనిని సాధించగలం అని నేను నమ్ముతాను. మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నామో అనే దానిని బట్టే మన మనస్తత్వాలు రూపు దాల్చుతాయి.
చరిత్ర పర్యంతం, మానవ జాతి లోటుపాటుల మధ్యన జీవిస్తూ వచ్చింది అని చెప్పాలి. పరిమితంగా ఉన్నటువంటి వనరుల కోసం మనం ఒకరితో మరొకరం పోట్లాడుకొంటూ వచ్చాం. దీనికి కారణం, మన అస్తిత్వం అనేది ఆయా వనరులను ఇతరులకు దక్కకుండా చూడడం పైన ఆధారపడి ఉండడమే. ఎదుర్కోవడం, పోటీ పడడం అనేవి ఆదర్శాలుగా అయిపోయాయి. ఈ ప్రతిఘటన, స్పర్ధలు అనేవి విభిన్న భావాలకు, సిద్ధాంతాలకు, గుర్తింపులకు మధ్య తలెత్తాయి.
దురదృష్ట వశాత్తు, మనం ఇప్పటికీ కూడా అదే తరహా శూన్య సారాంశ మనస్తత్వపు వలలో చిక్కుకుపోయి ఉన్నాం. ఒక ప్రదేశం గురించో, లేదా వనరుల గురించో దేశాలు జగడానికి దిగినప్పుడు ఈ అంశం మన కళ్ల కు కనిపిస్తుంది. నిత్యవసర వస్తువుల సరఫరాలను ఆయుధాల వలె ఉపయోగించుకొంటున్నప్పుడు దీనిని మనం గమనించగలుగుతున్నాం.
టీకామందుల అలభ్యతతో వందల కోట్ల కొద్దీ ప్రజలు అల్లాడుతూ ఉంటే కొన్ని వర్గాలు ఆ వేక్సీన్ లను దాచిపెట్టుకొనే పోకడను పోతున్నప్పడు దీనిని మనం గ్రహించగలుగుతాం. ఎదురు తిరగడం, ఇంకా దురాశ అనేవి  మానవ స్వభావంలో భాగాలే అంటూ కొంత మంది ఓ వాదనను లేవదీస్తే లేవదీయవచ్చును. ఈ వాదన ను నేను ఒప్పుకోను.
మనుషులు స్వత:సిద్ధంగా స్వార్థపరులు అయి ఉంటే మరి మన అందరిలోనూ మౌలికంగా ఉన్న ఏకత్వాన్ని గురించి అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు అనాది గా ఘోషిస్తూ వచ్చాయి కదా, ఆ విజ్ఞ‌ప్తిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అటువంటి ఒక సంప్రదాయమే ప్రాణులు అన్నిటిని, చివర కు ప్రాణం లేని వాటిని కూడాను, అయిదు తత్త్వాలతో ఏర్పడినవి గా చూడడం జరుగుతున్నది.
ఈ సంప్రదాయం భారతదేశం లో ప్రజాదరణకు పాత్రం అయింది. ఆ పంచ తత్వాలు ఏవేవి అంటే అవి నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవే. ఈ మూలకాల మధ్యన గల సామంజస్యం మన లోపల, మన అందరి మధ్య సైతం నెలకొనడం జరిగిందా? అంటే అప్పుడు అది మన భౌతిక, సామాజిక, పర్యావరణ శ్రేయాని కి ఎంతో ముఖ్యమైంది గా అవుతుంది.
ఈ ఏకత్వం తాలూకు సార్వత్రిక భావన ను ప్రోత్సహించడం కోసం భారతదేశం జి20 అధ్యక్ష స్థానంలో ఉంటూ పాటు పడనుంది. ఈ కారణం గానే, ‘ఒకే పృధ్వి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనేది మన ఇతివృత్తం గా ఉన్నది. ఇది కేవలం ఒక నినాదం కాదు. ఇది మానవీయ పరిస్థితుల లో ఇటీవల వచ్చిన మార్పుల ను లెక్క లోకి తీసుకొంటుంది.
ఆ స్థితిగతుల గుణాలను గ్రహించడంలో మనమంతా ఉమ్మడిగా విఫలం అయ్యాం. ప్రస్తుతం, ప్రపంచంలో ప్రజలందరి కనీస అవసరాలను తీర్చడానికి చాలినంత ఉత్పాదనలను తయారు చేసుకోగలిగేందుకు తగిన సాధనాలు మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం, మనం మన మనుగడ కోసం పోరాటానికి దిగవలసిన అగత్యం ఏమీ లేదు. నేటి మన యుగాని కి యుద్ధోన్ముఖ యుగంగా మారవలసిన పని లేదు. అలా అసలు జరగనే కూడదు.
ప్రస్తుతం, మనం ఎదుర్కొంటున్న జలవాయు పరివర్తన, ఉగ్రవాదం, మహమ్మారులు అనే అతి పెద్దవి అయినటువంటి సవాళ్ళకు పరిష్కారాలను మనలో ఒకరితో మరొకరం పోరాడుకొంటుండడం ద్వారాగా కాకుండా, కలిసికట్టుగా కృషి చేయడం ద్వారానే పరిష్కరించుకో గలుగుతాం.
సమస్త మానవాళి ఎదుర్కొనే సవాళ్ళకు పరిష్కారాలను అందించ గలిగే సాధనాలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం మనకు ప్రసాదిస్తుండడం అనేది మనం చేసుకొన్న అదృష్టం. మనం ప్రస్తుతం నివసిస్తున్న విశాల వర్చువల్ జగతి డిజిటల్ టెక్నాలజీల వ్యాప్తి ఎంతటి అపారమైందో చాటిచెబుతోంది.
ప్రపంచ దేశాల జనాభాలో ఆరింట ఒక వంతు ప్రజలకు ఆశ్రయాన్ని ఇస్తున్నటువంటి, మరి తనలో అనేకమైన భాషలను, మతాలను, ఆచారాలను, విశ్వాసాలను ఇముడ్చుకొన్నటువంటి భారతదేశం ఈ విశాలమైన ప్రపంచం తాలూకు లఘు రూపం గా ఉన్నది అనవచ్చును.  సామూహిక నిర్ణయాలను తీసుకొనేటటువంటి అతి ప్రాచీన సంప్రదాయాలకు నిలయం అయిన భారతదేశం ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మూలభూతమైన డిఎన్ఎకు తన వంతు తోడ్పాటును అందిస్తున్నది.
ప్రజాస్వామ్యానికి జననిగా ఉన్న భారతదేశంలో జాతీయ ఏకాభిప్రాయం ఏ ఆజ్ఞ‌ ద్వారానో రూపొందినది కాదు.  లక్షల కొద్దీ స్వతంత్ర కంఠాలు ఒకే స్వరంలో ఆలాపించే శ్రావ్యమైన సంగీత బాణిగా దానిని అభివర్ణించవచ్చును. ప్రస్తుతం, భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మేం ఆచరిస్తున్న పౌర ప్రధాన పాలన నమూనా అనేది ఇటు మా ప్రతిభాశాలి యువతలో సృజనాత్మక ప్రతిభను పెంచి పోషిస్తూనే, అటు అత్యంత నిరాదరణ కు లోనైన మా పౌరులను గురించి శ్రద్ధను తీసుకొనేటటువంటిదిగా కూడా ను ఉంది.
మేం దేశ అభివృద్ధి ప్రక్రియను పై స్థాయి నుండి కింది స్థాయికి ప్రసరించేటటువంటి పాలన సంబంధి ప్రక్రియకు భిన్నంగా పౌరులే నాయకత్వ స్థానంలో నిలచే ‘ప్రజా ఆందోళన’ గా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని చేశాం. మేం అందరికీ అందుబాటులో ఉండేటటువంటి, అన్ని వర్గాలను కలుపుకొని పోయేటటువంటి, నిర్వహణ సులభతరంగా ఉండేటటువంటి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ను సృష్టించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొన్నాం.
ఈ డిజిటల్ పబ్లిక్ గూడ్స్ కారణంగా సామాజిక సురక్ష, విత్తపరంగా అన్ని వర్గాలను కలుపుకొనిపోవడంలతో పాటు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ వంటి విభిన్న రంగాల లో క్రాంతికారి ప్రగతి కూడా చోటు చేసుకొన్నది. ఈ కారణాలు అన్నిటి రీత్యా భారతదేశం పోగేసుకొన్న అనుభవాలు ప్రపంచ స్థాయి పరిష్కార మార్గాలను వెదకడం కోసం కావలసినటువంటి అంతర్ దృష్టి ని ప్రసాదించ గలుగుతాయి.
జి20 కి అధ్యక్షత వహించే కాలంలో, మేం భారతదేశపు అనుభవ సారాన్ని, భారతదేశపు జ్ఞానాన్ని, భారతదేశం ఆవిష్కరించిన నమూనాలను అన్యుల కోసం, మరీ ముఖ్యంగా అభివృద్ధిశీల దేశాల కోసం అవి అనుసరించదగ్గ విధంగా ప్రతిపాదించనున్నాం.
మన జి20 కూటమి ప్రాథమ్యాలను- కేవలం జి20 భాగస్వామ్య దేశాలను సంప్రదించడం తోనే సరిపెట్టకుండా, చాలా సందర్భాలలో వాటి అభిప్రాయాలను వినిపించేందుకు అయినా అవకాశం లభించకుండా పోతున్న అటువంటి పేద దేశాలన్నిటిని కూడాను సంప్రదించడం ద్వారా – నిర్ణయించడం జరుగుతుంది.
మన ప్రాథమ్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే అవి మనకు ఉన్నటువంటి ‘ఒకే భూమి’ని సంరక్షించుకోవడం పైన, మన ‘ఒకే పరివారం’ సభ్యుల మధ్య సద్భావనను అంకురింపచేయడం పైన, అలాగే మన అందరి ‘ఏక భవిష్యత్తు’ పట్ల ఆశను చిగురింప జేయడం పైన శ్రద్ధ తీసుకొంటాయి.
మన భూగ్రహాన్ని పోషించుకోవడం కోసం, ప్రకృతి విషయంలో ధర్మకర్తృత్వ భూమికను పోషిస్తూ వస్తున్నటువంటి భారతదేశపు సంప్రదాయాల వెలుగులో దీర్ఘకాలం మనుగడలో ఉండేటటువంటి, పర్యావరణంతో స్నేహపూర్వకంగా నడుచుకొనేటటువంటి జీవన సరళులను మనం ప్రోత్సహించుకొందాం.
మానవ పరివారం సభ్యుల మధ్య పరస్పర సద్భావనను పెంపొందింపచేయడం కోసం, ఆహారం, ఎరువులు, చికిత్స ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడంలో రాజకీయాలు చోటు చేసుకోకుండా ఉండడానికి మనం కృషి చేద్దాం. మనం అటువంటి కృషిని చేసినప్పుడు, భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ ఉద్రిక్తతలు సాటి మానవులకు సంకట స్థితుల ను సృష్టించ జాలవు.
మన కుటుంబాలలో వలెనే ఎవరి అవసరాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయో వారిని గురించి మనం ముందుగా పట్టించుకొని తీరాలి. మన భావి తరాలలో ఆశలను రేకెత్తించడం కోసం, పెద్ద ఎత్తున విధ్వంసాన్ని కలగజేసేటటువంటి ఆయుధాల ద్వారా తలెత్తే ముప్పులను తగ్గించడం, ప్రపంచ సురక్షను పెంపొందింప చేయడం అనే అంశాల పై అత్యంత శక్తిశాలి దేశాల మధ్య నిజాయితీ గల చర్చ జరిగేటట్టు మనం ప్రోత్సహించుదాం.
భారతదేశం అమలు పరచేటటువంటి జి20 కార్యక్రమాల పట్టిక అన్ని వర్గాలను కలుపుకొని పోయేటటువంటిది గాను, మహత్వాకాంక్షలతో నిండినది గాను, చేతలు ప్రధానమైందిగాను, నిర్ణయాత్మకం అయిందిగాను ఉంటుంది. జి20కి అధ్యక్ష బాధ్యతలను భారతదేశం నెరవేర్చేటటువంటి కాలాన్ని సంరక్షణ, సద్భావం, ఆశలతో కూడినటువంటి కాలంగా తీర్చిదిద్దడం కోసం ఏకతాటి మీద నిలబడదాం రండి.
మనిషి ప్రయోజనాలకు పెద్ద పీటను వేసే తరహా ప్రపంచీకరణకు తావును ఇచ్చే ఓ కొత్త వ్యవస్థను నిర్మించడం కోసం మనం కలసి పాటుపడదాం రండి.
(జి20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం)