ఏపీ మంత్రి జయరాం భార్యకు ఐటి నోటీసులు 

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటీ శాఖ షాకిచ్చింది. ఆయన భార్య రేణుకమ్మకు నోటీసులు జారీ చేసింది. బినామీ చట్టం కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసింది.
 
 మొత్తం రూ. 52.42 లక్షల విలువైన కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని నోటీసుల్లో పేర్కొంది.  ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలు రిజిస్టర్ అయిందని చెప్పారు. 
 
మిగిలిన భూమి రిజిస్టర్ అయిన వాళ్లు మంత్రి బినామీలేనని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మొత్తం 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు తెలిపారు. 90 రోజుల్లోగా ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఆదాయ వనరులను తనకు తెలపాలని  నోటీసుల్లో పేర్కొన్నారు.

గతంలో కూడా ఇదే భూముల వివాదంలో జయరాం చిక్కుకున్నారు. ఇతినా ప్లాంటేషన్స్ సంస్థకు చెందిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆ సంస్థ డైరెక్టర్ మనో బెంగళూరులో కేసు పెట్టారు. రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరారు. ఈ క్రమంలో మనోపై రేణుకమ్మ, వారి బంధువు ఆస్పరి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.