రూ. 22.10 కోట్ల జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తుల జప్తు

మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు సంబంధించి ప్రభాకర్‌ రెడ్డి కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను కూడా అటాచ్‌ చేసింది.
వీటిలో దివాకర్‌ రోడ్‌లైన్స్‌, జటధా ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో ఆస్తులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొన్నది. జటధర ఇండస్ట్రీస్‌, గోపాల్‌రెడ్డి అండ్‌ కో బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేసిందని చెప్పారు. వాటి రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గడువు తీరి విక్రయం కాకుండా ఉన్న 154 లారీలను నాగాలాండ్‌లో స్క్రాప్ కింద కోనుగోలు చేశారు. వాటిని 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని ఇతరులకు విక్రయించారు. మరికొన్నింటిని జేసీ కంపెనీ నిర్వహిస్తుంది.
అశోక్ లేలాండ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. వాహనాల రిజిస్ట్రేషన్‭లో నకిలీ ఇన్వాయిస్‭లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్లు అధికారులు గుర్తించారు. నాగాలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు విచారణలో తేలింది. 
ఆర్టీవో అధికారులే నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాల కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  
అయితే ఈ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు.. నకిలీ పత్రాలతో తమకు కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసిన ఈడీ.. విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జేసీ సోదరుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇప్పటికే విచారించిన విషయం విధితమే.