తిరుమల శ్రీవారి ఆలయం బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు

తిరుమల శ్రీవారి ఆలయంలో అమలవుతున్న బ్రేక్‌ దర్శన సమయంలో మార్పును గురువారం నుంచి అమలులోకి వచ్చింది. వేకువ జామున 3 గంటల సమయంలో శ్రీవారి ఆలయానికి వచ్చిన అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహించిన తరువాత సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపిన అనంతరం సుప్రభాత సేవ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
 తదుపరి తోమాల, అర్చన సేవలను నిర్వహించి గతంలో లాగే ఈ సేవల సమయంలో సర్వదర్శనం కోసం వైకుంఠం కాంప్లెక్సులో వేచివున్న భక్తులను దర్శనానికి అనుమతించి సేవలు ముగిసిన తర్వాత మూలవర్లకు నైవేద్యం సమర్పించి, ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఉదయం 8 గంటల నుంచి విఐపిబ్రేక్‌ (ప్రజాప్రతినిధులు సిఫారసు) దర్శన టికెట్లు పొందిన భక్తులను ముందుగా దర్శనానికి అనుమతించి 10 గంటల సమయంలో స్వామివారికి రెండవ ఘంట నైవేద్యం సమర్పించి, తిరిగి 10.30 గంటల సమయంలో ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించారు.
అటు తర్వాత శ్రీవాణి ట్రస్టు టికెట్లు పొందిన భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. గురువారం నుంచి బ్రేక్‌ దర్శన సమయాన్ని మర్చడంతో శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులతో పాటు కొంతమంది బ్రేక్‌ దర్శన టికెట్లు కలిగిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారని, రాబోవు రెండురోజుల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తామని టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.